
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
ఉండవెల్లి: మండలంలోని పుల్లూరు గ్రామ శివారులో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఎస్ఐ మహేష్ వివరాల ప్రకారం పంట పొలాల్లో దుస్తులు లేని వ్యక్తి మృతదేహం కన్పించిందని తెలిపారు. ఐడీ కార్డులు, ఎటువంటి గుర్తులు లేకపోవడంతో మృతదేహాన్ని అలంపూర్ ఆస్పత్రిలోని మార్చురికి తరలించారు. ఎవరైన గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
అప్పు ఇచ్చినోళ్లకు కుచ్చుటోపి
అయిజ: చిరు వ్యాపారాల పేరుతో అనేక మందితో అప్పులు చేసిన ఓ వ్యక్తి కనిపించకుండా పోయాడు. వివరాల్లోకి వెళ్తే.. అయిజకు చెందిన ఓ వ్యక్తి కొన్నేళ్లుగా చిరు వ్యాపారాలు చేసుకుంటూ తెలిసిన వారితో వడ్డీకి అప్పు తీసుకున్నాడు. కొంతకాలం పాటు అప్పు ఇచ్చిన వారికి వడ్డీతో సహా అసలు చెల్లించి నమ్మకం పెంచుకున్నాడు. ఈ క్రమంలో సుమారు రూ. 3కోట్ల మేర అప్పుచేసిన అతడు.. కుటుంబ సభ్యులతో సహా ఇక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో అప్పు ఇచ్చిన వారు ఆందోళన చెందుతున్నారు. పది రోజుల క్రితం పట్టణంలో ఓ చిరువ్యాపారి సుమారు రూ. కోటి అప్పుచేసి ఐపీ పెట్టిన ఘటన మరువకముందే మరో వ్యక్తి అదే బాటలో నడవడం చర్చనీయాంశంగా మారింది. అదే విధంగా గతేడాది ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో ఓ వ్యక్తి వడ్డీ వ్యాపారుల నుంచి సుమారు రూ. 50కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశాడు. రెండేళ్ల క్రితం స్వీట్ హౌస్ నడుపుకుంటున్న వ్యాపారి రూ. కోటికి పైగా అప్పులుచేసి పరారు కావడాన్ని ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. వరుస ఘటనలతో అప్పులు ఇచ్చేందుకు ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది.
షార్ట్సర్క్యూట్తో
పూరి గుడిసె దగ్ధం
లింగాల: మండలంలోని అంబట్పల్లిలో షార్ట్సర్క్యూట్తోపూరి గుడిసె దగ్ధమైన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పూర్ణకంటి దేవయ్య పని నిమిత్తం గుడిసెకు తాళం వేసి భార్య, కూతురుతో కలిసి పొలానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు షార్ట్సర్క్యూట్ జరిగి గుడిసెకు నిప్పు అంటుకొని పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో వంటసామాగ్రి, దుస్తులు, తిండి గింజలు, వ్యవసాయ పనులకు కోసం ఉంచుకున్న డబ్బులు కాలిపోయాయి. దాదాపుగా రూ.50 వేలు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు తెలిపాడు.