
జూరాలకు తగ్గిన ఇన్ఫ్లో
ధరూరు/ ఆత్మకూరు/ రాజోళి/ దోమలపెంట: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లో స్వల్పంగా తగ్గింది. సోమవారం ప్రాజెక్టుకు 24 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా.. మంగళవారం సాయంత్రానికి 17 వేల క్యూసెక్కులకు తగ్గినట్లు అధికారులు తెలిపారు. జెన్కో జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తిని కొనసాగిస్తున్నారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 16,752 క్యూసెక్కులు, నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా 750, కోయిల్సాగర్కు 315 వదలగా.. 68 క్యూసెక్కులు ఆవిరైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.454 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
● జల విద్యుత్ కేంద్రాల్లో మంగళవారం 6 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 3 యూనిట్ల ద్వారా 117 మెగావాట్లు, దిగువలో 3 యూనిట్ల ద్వారా 120 మెగావాట్లు ఉత్పత్తి సాధించామన్నారు. ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఇప్పటి వరకు 15.948 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టామన్నారు.
శ్రీశైలానికి 18,964 క్యూసెక్కులు
జూరాల, సుంకేసుల నుంచి కలిపి 18,964 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం జలాశయానికి వస్తుంది. ప్రస్తుతం శ్రీశైలంలో 833.2 అడుగుల వద్ద 52.8918 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గత 24 గంటల వ్యవధిలో రేగుమాన్గడ్డ నుంచి ఎంజీకేఎల్ఐకి 480 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో 0.372 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసి 830 క్యూసెక్కులు, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో 1.182 మి.యూనిట్లు ఉత్పత్తి చేసి 2,465 క్యూసెక్కుల నీటిని దిగువన నాగార్జునసాగర్కు విడుదల చేశారు.
సుంకేసులకు స్వల్ప వరద
సుంకేసుల డ్యాంకు మంగళవారం స్వల్పంగా ఇన్ఫ్లో కొనసాగుతుంది. ఎగువ నుంచి 2,248 క్యూసెక్కులు రాగా.. ఒక గేటును తెరిచి అంతే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేశారు. అలాగే కేసీ కెనాల్కు 159 క్యూసెక్కులు విడుదల చేసినట్లు జేఈ మహేంద్ర తెలిపారు.