
సమస్యల పరిష్కారమే ‘భూభారతి’ లక్ష్యం
కురవి: కురవి, సీరోలు మండలాల్లో భూభారతి చట్టం రెవెన్యూ సదస్సులు మంగళవారం ప్రారంభమయ్యాయి. కురవి మండలం తిర్మాలాపురం, జగ్యాతండా, మొగిలిచర్ల, సీరోలు మండల కేంద్రంలో రెవెన్యూ సదస్సులు ప్రారంభం అయ్యాయి. తిర్మలాపురం గ్రామంలో జరిగిన సదస్సులో అడిషనల్ కలెక్టర్ వీరబ్రహ్మచారి పాల్గొన్నారు. రైతులు తమ సమస్యలను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. భూభారతితో రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్లు విజయ, పున్నంచందర్, ఆర్ఐ రవికుమార్ పాల్గొన్నారు.
ప్రజలను
అప్రమత్తం చేయాలి
● డీఎంహెచ్ఓ భూక్య రవిరాథోడ్
మహబూబాబాద్ రూరల్: వానాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని డీఎంహెచ్ఓ భూక్య రవిరాథోడ్ అన్నారు. మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆశ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీఎంహెచ్ఓ హాజరై మాట్లాడారు. వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు మంచిపేరు తీసుకురావాలని సూచించారు. ఉద్యోగులు, సిబ్బంది తమ విధి నిర్వహణలో అలసత్వం వహించొద్దని పేర్కొన్నారు. సమావేశంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాగర్, డిప్యూటీ డెమో ప్రసాద్, హెచ్ఈ రాజు, హెచ్ఈఓ నరేశ్, సిబ్బంది సక్రి, పుష్పలీల, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
రైతులు నాణ్యమైన
విత్తనాలు ఎంచుకోవాలి
మహబూబాబాద్ రూరల్: రైతులు నాణ్యమైన విత్తనాలు ఎంచుకోవడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని మల్యాల కేవీకే కోఆర్డి నేటర్ డాక్టర్ ఎస్.మాలతి, ఏడీఏ శ్రీనివాసరావు అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మహబూబాబాద్ పట్టణంలోని రైతు వేదికలో మంగళవారం నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు సమగ్ర సస్యరక్షణ చేపట్టి భూసారాన్ని కాపాడాలని కోరారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల రైతులకు ఈ వానాకాలం సీజన్ కోసం వరి డబ్ల్యూజీఎల్–44, డబ్ల్యూజీఎల్–1246, డబ్ల్యూజీఎల్ –1355, పెసర ఎంజీజీ–385 రకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఐదు మండలాల వ్యవసాయ అధికారులు, విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారమే ‘భూభారతి’ లక్ష్యం