
కొనుగోలు కేంద్రంలో ధాన్యం ‘మాయం’
చిన్నగూడూరు: రైతులు ఆరుగాలం చెమటోడ్చి కష్టపడి పండించిన ధాన్యం దళారుల పాలవుతుంది. మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో వరుసగా రెండోసారి ధాన్యం బస్తాలు మాయమయ్యాయి. బాధిత రైతులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండల కేంద్రానికి చెందిన బాధిత రైతులు నామ సునీతరాజు, కోల లచ్చమ్మశ్రీను కథనం ప్రకారం.. గత నెల 9న సునీతకు చెందిన 84 బస్తాలు(33 క్వింటాళ్ల 60 కేజీలు), లచ్చమ్మకు చెందిన 38 బస్తాలు(15 క్వింటాళ్ల 20 కేజీలు) మొత్తం 122 బస్తాలు ధాన్యం కాంటా వేవారు. మరుసటి రోజు ట్రాక్టర్ల ద్వారా మిల్లులకు తరలించారు. వే బ్రిడ్జి కాంటా అయిన మరో పది రోజులకు 110 బస్తాలకు కాంటా అయినట్లు ఫోన్కు ఓటీపీ వచ్చిందని మరిపెడ చారి అనే వ్యక్తి నుంచి ఫోన్ రావడంతో రైతులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. 122 బస్తాలకు 110 బస్తాలు కాంటా అయితే మిగతా 12 బస్తాల ధాన్యం ఏమైందంటూ కొనుగోలు కేంద్రం నిర్వహకులను ప్రశ్నించగా వారు పట్టించుకోలేదు. దీంతో తహసీల్దార్ మహబూబ్అలీ, ఎస్సై ప్రవీణ్కుమార్కు ఫిర్యాదు చేశామని బాధిత రైతులు తెలిపారు.
● వరుసగా రెండోసారి ఘటన
● పట్టించుకోని కేంద్రం నిర్వాహకులు