
ఎట్టకేలకు మోక్షం !
మహబూబాబాద్: పదేళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ఎట్టకేలకు మంజూరు చేస్తున్నారు. నాలుగు నెలల నుంచి కార్డులు అందజేస్తున్నారు. దీంతో దరఖాస్తుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 23,007 దరఖాస్తులకు గాను 16,483 దరఖాస్తులను పరిష్కరించి రేషన్ కార్డులను అందజేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుండడంతో రేషన్కార్డు దరఖాస్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అలాగే సంబంధిత కార్యాలయాలు నూతన దరఖాస్తుదారులతో కిటకిటలాడుతున్నాయి. అ యితే రేషన్కార్డుల మంజూరులో కొంత ఆలస్యంపై దరఖాస్తుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 23,007 దరఖాస్తులు..
జిల్లాలో 18 మండలాలు, 482 గ్రామపంచాయతీలు, 5 మున్సిపాలిటీ ఉన్నాయి. కొత్త రేషన్కార్డుల కోసం 23,007 దరఖాస్తులు వచ్చాయి. కాగా ఈనెల 29 తేదీ వరకు 16,483 దరఖాస్తులను పరిష్కరించారు. ఆధార్ కార్డు, ఇంటి పన్ను, నివాస ధ్రువీకరణ పత్రాలతో మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఆతర్వాత ఆపత్రాలను తహసీల్దార్ కార్యాలయంలో అందజేస్తున్నారు. అనంతరం ఆర్ఐ విచారణ చేసి, నివేదిక ఇవ్వగానే అంతా సక్రమంగా ఉంటే తహసీల్దార్ లాగిన్లో సంతకం పూర్తి అవుతుంది. ఆతర్వాత ఆన్లైన్లోనే డీసీఎస్ఓ లాగిన్లోకి వెళ్తాయి. ఆతర్వాత డీసీఎస్ఓ కార్యాలయంలో మంజూరు అయిన వెంటనే దరఖాస్తుదారుడి సెల్ నంబర్కు మెసేజ్ వస్తుంది. అనంతరం మీసేవ కేంద్రాల్లో ఆహార భద్రతకార్డులను ప్రింట్ తీసుకుంటున్నారు.
సన్న బియ్యం పంపిణీతో..
ఏప్రిల్ నెల నుంచి సన్న బియ్యం పంపిణీతో దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో పెండింగ్ దరఖాస్తుల సంఖ్య పెరుగుతోంది. సంబంధిత కార్యాలయాల్లో ఆ దరఖాస్తులే ఎక్కువగా ఉన్నాయి. రేషన్కార్డు ఉంటేనే సంక్షేమ పథకాలకు అర్హులు కావడంతో తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.
మీసేవ కేంద్రాల్లో దోపిడీ..
జిల్లాలో 95 మీసేవ కేంద్రాలు ఉన్నాయి. కాగా రేషన్కార్డు కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. దరఖాస్తుకు చెల్లించాల్సిన రుసుము కంటే ఎక్కువగా తీసుకుంటున్నారని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దోపిడీని అరికట్టడంలో అధికారులు విఫలమయ్యారు.
23,007 దరఖాస్తులకు 16,483దరఖాస్తుల పరిష్కారం
లబ్ధిదారులకు రేషన్ కార్డుల మంజూరు
హర్షం వ్యక్తం చేస్తున్న
దరఖాస్తుదారులు
సన్న బియ్యం పంపిణీతో పెరుగుతున్న దరఖాస్తులు
రేషన్ కార్డు రావడం ఆనందంగా ఉంది..
రేషన్ కార్డు కోసం కొన్ని సంవత్సరాలుగా చాలా మంది ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం కల్పించిన అవకాశంతో దరఖాస్తు చేసుకున్న 20 రోజుల్లోనే మంజూరు చేశారు. వెంటనే మీసేవ కేంద్రంలో ఆహార భద్రత కార్డు తీసుకున్నా. ఎంతో సంతోషంగా ఉంది.
– ఫిరోజ్ ఖాన్, మానుకోట

ఎట్టకేలకు మోక్షం !