
విరివిగా మొక్కలు నాటాలి
చిలకలపూడిమచిలీపట్నం): విరివిగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో బుధవారం ఆయన వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమంపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గురువారం జిల్లా వ్యాప్తంగా 2.92 లక్షల మొక్కలను నాటే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, వివిధ సంక్షేమ శాఖ వసతి గృహాల ఆవరణల్లో మొక్కలు నాటాలని సూచించారు. డ్వామా పీడీ ఎన్వీ శివప్రసాద్ యాదవ్, జిల్లా పంచాయతీ అధికారి జె.అరుణ ఇరువురు సమన్వయం చేసుకుంటూ మొక్కలు నాటే ప్రక్రియను చేపట్టాలన్నారు. ప్రస్తుతం జిల్లాలోని పలు మండలాల్లో ఉన్న నర్సరీల నుంచి వివిధ రకాల మొక్కలను పంపిణీ చేస్తామన్నారు. అవనిగడ్డ మండలంలోని పులిగడ్డ నర్సరీ నుంచి 7 వేల మొక్కలు, పెడన మండలంలోని నందమూరు నర్సరీ నుంచి 40 వేలు, సరుగుడు మొక్కలు 1.5 లక్షలు, గన్నవరం మండలంలోని వీరపనేనిగూడెం నర్సరీ నుంచి 50 వేలు, గూడూరు మండలం గూడూరు నర్సరీ నుంచి 10 వేల మొక్కలు అందిస్తామన్నారు. జూన్ 5వ తేదీ నుంచి జరగనున్న మసుల బీచ్ ఫెస్టివల్ ఉత్సవాల్లో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించనున్నామని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారి శ్రీనివాసరావు కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా గుడ్డతో తయారు చేసిన సంచులను కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, జిల్లా అటవీ శాఖ అధికారి సునీత, బీసీ వెల్ఫేర్ అధికారి రమేష్, సోషల్ వెల్ఫేర్ డీడీ షాహిద్ బాబు, డీటీడబ్ల్యూఓ ఫణి ధూర్జటి, పశుసంవర్థక శాఖ అధికారి చిన నరసింహులు, మచిలీపట్నం, గుడివాడ, పెడన, ఉయ్యూరు, తాడిగడప మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.