
దుర్గమ్మ సన్నిధిలో వృద్ధులు, దివ్యాంగులకు ఇక్కట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో వృద్ధులు, దివ్యాంగులకు ఇక్కట్లు తప్పడం లేదు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే వృద్ధులు, దివ్యాంగుల సౌలభ్యం కోసం దేవస్థానం రూ.8 లక్షలతో గాలిగోపురం వద్ద స్టేర్ లిఫ్ట్ను ఏర్పాటు చేసింది. అయితే ఆలయ ఇంజినీరింగ్ అధికారుల అల సత్వం కారణంగా నాణ్యత లేని స్టేర్ లిఫ్ట్ తరచూ మరమ్మతులకు గురవుతోంది. 15 రోజుల కిందట అవసరమైన మరమ్మతులు నిర్వహిస్తామంటూ టెక్నికల్ సిబ్బంది స్టేర్ లిఫ్ట్ను తీసుకెళ్లారు. అయితే ఇంత వరకు ఆ లిఫ్ట్ సంగతిని పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ దివ్యాంగుడి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో ఉన్న ఆ దివ్యాంగ భక్తుడిని వీల్చైర్పై అమ్మవారి దర్శనానికి తీసుకొచ్చారు. ఆలయంలోకి వెళ్లాలంటే గాలి గోపురం వద్ద మెట్లు దిగాల్సిందే. అక్కడ స్టేర్ లిఫ్ట్ లేకపోవడంతో వీల్చైర్పై వచ్చిన ఆ దివ్యాంగుడిని ఆలయ, సెక్యూరిటీ సిబ్బంది, సేవా సిబ్బంది నలుగురు కలిసి మోసుకుని వెళ్లాల్సి వచ్చింది. కనీసం ఇటువంటి వారిని చూసేనా ఆలయ అధికారులు స్పందించాలని పలువురు భక్తులు కోరుతున్నారు.