
యోగాతో శ్రామికుల్లో నూతనోత్సాహం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నిత్యం శారీరక శ్రమ చేసే కార్మికుల్లో యోగా సాధన నూతన ఉత్సాహాన్ని నింపుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో ఆయుష్ శాఖ, కార్మిక శాఖ, జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో కార్మికుల థీమ్ యోగాసనాల కార్యక్రమం జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ, ఉపకార్మిక కమిషనర్ సీహెచ్.ఆశారాణి, వీఎంసీ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్ కార్మికులతో కలిసి యోగ సాధన చేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. రోగాలబారిన పడకుండా ఉండటంతో పాటు మానసికంగా నూతన ఉత్తేజాన్ని పొందేందుకు యోగాను మించి దివ్య ఔషధం మరొకటి లేదన్నారు. అన్ని వర్గాల ప్రజలకు యోగాసనాలను చేరువ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం నెల రోజుల పాటు యోగాపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.సుహాసిని, ఆయుష్ అధికారులు డాక్టర్ వి.రాణి, డాక్టర్ రామత్లేహి, డాక్టర్ రత్నప్రియదర్శిని, యోగా ట్రైనర్లు సత్య నారాయణ, రామాంజనేయులు పాల్గొన్నారు.