
ఎస్ఎన్ పురం మోడల్ పోలీస్స్టేషన్ ప్రారంభం
మధురానగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో మోడల్ పోలీస్స్టేషన్లు నిర్మించడంతో పాటు ఆధునిక టెక్నాలజీతో నేరాలకు అడ్డుకట్ట వేస్తున్నామని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. విజయవాడ జీఎస్ రాజు రోడ్డులో నూతనంగా నిర్మించిన సత్యనారాయణపురం పోలీస్స్టేషన్ను సోమవారం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, పోలీసు అధికారులతో కలిసి ప్రారంభించారు.
డ్రోన్, సీసీ కెమేరాల పర్యవేక్షణ..
ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. ఇక్కడ అన్ని వసతులు, ఆధునిక పరిజ్ఞానంతో నిర్మించిన మోడల్ పోలీస్స్టేషన్ను తన చేతుల మీదుగా ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు. టెక్నాలజీ అందిపుచ్చుకోవడంలో ఏపీ పోలీసులు ముందున్నారని, టెక్నాలజీ ద్వారా నేరాలకు ఏపీలో అడ్డుకట్ట వేస్తున్నామని చెప్పారు. హాట్ స్పాట్లు ఎక్కువగా ఉన్న విజయవాడ లాంటి చోట పటిష్టమైన భద్రత అవసరమని, ఎన్టీఆర్ జిల్లా డ్రోన్, సీసీ కెమేరాల పర్యవేక్షణలో ఉందన్నారు. పోలీస్ స్టేషన్లో జిమ్, యోగా రూమ్ కూడా ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రశంసించారు. గంజాయి నిర్మూలనలో ఈగల్ టీమ్ పనితీరు బాగుందని.. శాంతిభద్రతలు రక్షించాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటుందన్నారు. పోలీసులు కఠినంగా ఉంటేనే నేరాలు అదుపులో ఉంటాయని చెప్పారు. పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు మాట్లాడుతూ.. సత్యనారాయణపురాన్ని మోడల్ పోలీస్స్టేషన్గా నిర్మించి ప్రారంభించామన్నారు. ఆధునిక టెక్నా లజీ పరిజ్ఞానంతో నేరం జరిగిన 24 గంటలలోపే నేరస్తుడిని పట్టుకునేలా కమిషనరేట్ పని చేస్తోందని చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణకు వేలాది సీసీ కెమేరాలు ఏర్పాటు చేశామని, ఇందుకు సహకరిస్తున్న ప్రజలు, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పోలీస్స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మె ల్యే బొండా ఉమా, సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్వీవీ లక్ష్మీనారాయణ, డీసీపీలు కేజీవీ సరిత, తిరుమలేశ్వరరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
ఆధునిక టెక్నాలజీతో నేరాలకు అడ్డుకట్ట
హోం శాఖ మంత్రి అనిత