
బదిలీల్లో గందరగోళ పరిస్థితులు తొలగించాలి
మచిలీపట్నంఅర్బన్: ఉపాధ్యాయుల బదిలీల్లో నెలకొన్న గందరగోళ పరిస్థితులు తొలగించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) నాయకులు సోమవారం జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సర్ప్లస్ ఉపాధ్యాయులను విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠశాలలకు ఇప్పుడే సర్దుబాటు చేసి, క్రమబద్దీకరించిన ఖాళీల జాబితాను విడుదల చేయాలని కోరామన్నారు. పీఎస్ హెచ్ఎం పోస్టుల భర్తీకి సర్ప్లస్ టీచర్లను అధికారులు ఫోన్లు చేసి దరఖాస్తుకు ఒత్తిడి చేయటం సరికాదన్నారు. పీఎస్ హెచ్ఎంకు వెళ్లాల్సిన టీచర్ల జాబితాను సబ్జెక్ట్ పరంగా విడుదల చేయాలని చెప్పారు. ట్రాన్స్ఫర్స్ సీనియారిటీ జాబితాలు పుట్టిన తేదీ ఆధారంగా తయారు చేశారని, బదిలీల జీఓ ప్రకారం సీనియారిటీ ఆధారంగా తయారు చేయాలని కోరామన్నారు. ఉమ్మడి జిల్లాలో ఖాళీగా ఉన్న పీఎస్ హెచ్ఎం(ఉర్దూ) పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలన్నారు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి
ముందుగానే గ్రోవియన్స్ పరిష్కరించి ఫైనల్ సీనియారిటీ జాబితా విడుదల చేయాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బి.లంకేష్, రాష్ట్ర కార్యదర్శి తమ్ము నాగరాజు, జయ ప్రకాష్, జైగం అబ్బాస్ పాల్గొన్నారు.