
తెనాలి ఘటన బాధ్యులను కఠినంగా శిక్షించండి
మధురానగర్(విజయవాడసెంట్రల్): కూటమి పాలనలో దళిత, మైనార్టీలకు రక్షణ కరువైందని.. తెనాలి ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రభ కాలనీ జనహిత సదనంలో మంగళవారం మైనారిటీ దళిత యువకులపై తెనాలిలో పోలీసులు చేసిన అమానుష దాడిని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యాన నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి పాలనలో ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్య్రం హక్కులను హరిస్తున్నారని... రాష్ట్రంలో టీడీపీ చట్టాలు నడుస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. నడిరోడ్డుపై దళిత, మైనార్టీ యువకులను పోలీసులు విచక్షణ రహితంగా కర్రలతో కొడుతూ బూటు కాళ్లతో తన్నడం చూస్తే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. ఇలాంటి దురదృష్టకర ఘటనలను వైఎస్సార్ సీపీ ఖండిస్తోందన్నారు. జూన్ 4న మాజీ సీఎం జగన్హన్రెడ్డి పిలుపు మేరకు టీడీపీ అరాచక పాలన ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర, రాష్ట్ర మైనారిటీ విభాగం కార్యదర్శి మస్తాన్ షేక్, పఠాన్ నజీర్ ఖాన్, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి పేరం త్రివేణి రెడ్డి, కార్యదర్శి ఝాన్సీ రాణి, వేముల బేబీ రాణి, ఎన్టీఆర్ జిల్లా క్రిస్టియన్ విభాగం అధ్యక్షుడు సుధాకర్, నాయకులు ఎర్రగోళ్ల శ్రీరాములు, అలంపూర్ విజయ్, ఈసరపు రాజా రమేష్, ఒగ్గు గవాస్కర్, కుందేరు శ్యామ్, మార్తి చంద్రమౌళి, తోపుల వరలక్ష్మి, మాతా మహేష్, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కూటమి పాలనలో పెరిగిన దాడులు
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

తెనాలి ఘటన బాధ్యులను కఠినంగా శిక్షించండి