
నెల రోజుల్లో కొత్త అక్రిడిటేషన్లు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రస్తుతం ఉన్న అక్రిడిటేషన్ల గడువు నెలాఖరుతో ముగుస్తున్న నేపథ్యంలో వాటిని తక్షణమే రెన్యువల్ చేయాలని, ఈనెల 31, జూన్ 1వ తేదీలు ఆర్టీసీ సెలవు దినాలు కావడంతో బస్పాస్లు రెన్యువల్కు చర్యలు తీసుకోవాలని ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఐఅండ్పీఆర్ డైరెక్టర్ హిమాన్ష్శుక్లాకు విన్నవించారు. ఈ మేరకు మంగళవారం ఐఅండ్పీఆర్ కార్యాలయంలో డైరెక్టర్ హిమాన్షు శుక్లాను కలిసి ఏపీయూడబ్ల్యూజే నేతలు వినతి పత్రం అందజేశారు. మరోసారి అక్రిడిటేషన్ పొడిగించకుండా రెగ్యులర్గా ఇచ్చే కొత్త అక్రిడిటేషన్ల ప్రక్రియ వేగవంతంగా చేపట్టాలని డైరెక్టర్ను కోరారు. దీనిపై ఆయన స్పందిస్తూ .. వచ్చే నెల రోజుల్లోగా అర్హులైన జర్నలిస్టులు అందరికీ కొత్త అక్రిడిటేషన్లు మంజూరు చేస్తామని, ప్రస్తుతం ఉన్న కార్డులు రెన్యువల్ చేస్తామని చెప్పారు. జర్నలిస్టులు ఇబ్బంది పడకుండా ఈనెల 30వ తేదీ లోపే బస్ పాస్లు రెన్యువల్ చేసేలా చర్యలు తీసుకుంటామని చె ప్పారు. రెండు లేక మూడు నెలల కాలానికి అక్రిడేషన్లను రెన్యువల్ చేస్తామని, ఈలోపే రెగ్యులర్ అక్రిడేషన్ల ప్రక్రియ కూడా నెల రోజుల్లోగా పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. త్వరలోనే అక్రిడిటేషన్ కమిటీ జీవో వెలువడుతుందని శుక్లా యూనియన్ నేతలకు తెలిపారు. డైరెక్టర్ ను కలిసిన వారిలో ఏపీయూడబ్ల్యూజే విజయవాడ కమిటీ అధ్యక్షుడు చావా రవి, కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు, ప్రెస్క్లబ్ అధ్యక్షుడు కంచల జయరాజ్, కార్యదర్శి దాసరి నాగరాజు, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ రమణారెడ్డి తదితరులు ఉన్నారు.