
దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష
జస్టిస్ ఫర్ సౌత్ ఇండియా మూవ్మెంట్ వ్యవస్థాపకుడు కరణం రాజేష్ కుమార్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దక్షిణ భారతదేశంపై కేంద్రం వివక్ష చూపుతోందని జస్టిస్ ఫర్ సౌత్ ఇండియా ఉద్యమ వ్యవస్థాపకుడు డాక్టర్ కరణం రాజేష్ కుమార్ అన్నారు. సమస్యల పరిష్కారానికి యావత్ దక్షిణ భారతదేశం ఏకమై పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. విజయవాడ ప్రెస్క్లబ్లో జస్టిస్ ఫర్ సౌత్ ఇండియా మూవ్మెంట్ ఆధ్వర్యాన ఆదివారం రాజకీయ పార్టీల సమావేశం జరి గింది. 25 రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరణం రాజేష్ కుమార్ మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా గణనీయంగా తగ్గిందన్నారు. మొత్తం జనాభాలో కేవలం 17 శాతం మాత్రమే ఉందన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల కేటాయింపులో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. 1970లో డాక్టర్ కె.ఎల్.రావు ప్రతిపాదించిన నదులు అనుసంధాన ప్రాజెక్టులో ఇప్పటివరకు ఎలాంటి ప్రగతి లేదన్నారు. దేశానికి రెండో రాజధాని, సుప్రీంకోర్టు బెంచ్ దక్షిణాదిలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏపీ కమిటీ అధ్యక్షుడుగా జి.ఎస్.ఫణిరాజును నియమించారు. సమావేశంలో జైహింద్ పార్టీ దశరథరామిరెడ్డి, కనకం శ్రీనివాసులు, బాలకోటయ్య, డీఎస్ఎన్వీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.