
వడ్డీ వ్యాపారుల ఇళ్లలో సోదాలు
● పది మందిపై కేసు ● రూ.11లక్షలు, పలు డాక్యుమెంట్లు సీజ్
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలో అధిక వడ్డీ వసూలు చేస్తూ అక్రమంగా వ్యాపారం చేస్తున్న పలువురి ఇళ్లపై ఏఎస్పీ చిత్తరంజన్ ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం ఉదయం 5 గంటల నుంచి సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పది మందిపై కేసు నమోదు చేసి, రూ.11 లక్షల నగదు సీజ్ చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. బ్యాంకు చెక్కులు, ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నామన్నారు. సరైన అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారం చేసినా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సోదాల్లో నలుగురు సీఐలు, ఎనిమిది మంది ఎస్సైలు, 50 మంది సిబ్బంది పాల్గొన్నారు.