చినుకు జాడేది ? | - | Sakshi
Sakshi News home page

చినుకు జాడేది ?

Jun 9 2025 12:52 AM | Updated on Jun 9 2025 12:52 AM

చినుక

చినుకు జాడేది ?

మృగశిర మన్నించేనా..?

మృగశిర కార్తె ఆదివారం ప్రారంభమైంది. ఈ కార్తెలో అయినా వర్షాలు సమృద్ధిగా పడతాయా అని రైతులు ఎదురుచూస్తున్నారు. కాలం అనుకూలిస్తే మృగశిర కార్తెలో భారీ వర్షాలు కురిసి వాతావరణం చల్లబడే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం ఎండల తీవ్రత, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మే నెలలో అకాల వర్షాలతో ఎండల నుంచి ఉపశమనం పొందినా.. జూన్‌ మొదటి వారంలో మాత్రం ఎండలు, ఉక్కపోతతో విసిగిపోతున్నారు. ఎండల తీవ్రతకు జ్వరపీడితులు కూడా పెరుగుతున్నారు. మేతకు వెళ్లిన పశువులు, జీవాలు మధ్యాహ్నానికే ఇంటిదారి పడుతున్నాయి.

బూర్గంపాడు: మే నెలలో కురిసిన అకాల వర్షాలు రైతులను పంటల సాగుకు సన్నద్ధం చేశాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందస్తుగా వస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మే నెలాఖరులో ఉపరితల ఆవర్తనంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో రైతులు పంటల సాగుకు సిద్ధమయ్యారు. దుక్కులు చేసి పత్తి గింజలు వేశారు. కొన్ని చోట్ల పత్తి గింజలు మొలకెత్తాయి. అయితే వారం రోజులుగా చినుకు పడలేదు. దీంతో రైతులు వేసిన పత్తి గింజలు కొన్నిచోట్ల మొలకలు వచ్చి ఎండిపోతున్నాయి. లక్షల రూపాయలు ఖర్చుచేసి వేసిన పత్తి గింజలు మొలకెత్తుతాయో లేదోనని ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది.

గత నెలలో వర్షాలు..

మే నెల మొత్తం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. ఎండలు మండిపోవాల్సిన నెలలో అకాల వర్షాలు ప్రజలకు ఊరటనిచ్చాయి. మే నెలాఖరులో ఉపరితల ఆవర్తనంతో భారీ వర్షాలు కురిసి భూములు పదునయ్యాయి. ఈ తరుణంలోనే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయని వాతావరణశాఖ ప్రకటించింది. దీంతో రైతులు సాగు పనులు మొదలుపెట్టారు. మాగాణి భూముల్లో పచ్చిరొట్ట విత్తనాలు చల్లుకున్నారు. మే నెలాఖరులో వేసిన పత్తి గింజలు అకాల వర్షాలకు బాగానే మొలకెత్తాయి. ఆ తరువాత వేసిన పత్తిగింజలు మాత్రం వర్షాలు లేక మొలకెత్తలేదు. గత వారం, పది రోజులుగా ఎండలు దంచికొడుతుండగా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

పత్తి సాగు షురూ..

ఉమ్మడి జిల్లాలోని మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం, మధిర, సత్తుపల్లి తదితర ప్రాంతాల్లో రైతులు పత్తి సాగు మొదలుపెట్టారు. భద్రాద్రి జిల్లాలోనే సుమారు లక్ష ఎకరాల్లో ఇప్పటికే పత్తి గింజలు వేశారు. జిల్లాలోని రైతులు పొడి దుక్కుల్లోనే విత్తనాలు వేసుకోవడం ప్రతి ఏటా పరిపాటిగా మారింది. కేంద్ర ప్రభుత్వం పత్తికి మద్దతు ధర క్వింటాకు రూ. 589 పెంచటంతో ప్రస్తుతం రూ, 8,110కి చేరింది. దీంతో పత్తి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే రైతులు లక్ష ఎకరాల్లో పత్తి సాగు చేయగా మరో లక్షన్నర ఎకరాల్లో సాగు చేసే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేశారు. వర్షాలు కురిసిన తర్వాతే విత్తనాలు వేసుకోవాలని సూచిస్తున్నారు.

ఊరించి ఉసూరుమనిపించిన వానలు

జిల్లాలో పత్తి గింజలు వేసిన రైతులు

కొన్నిచోట్ల ఎండుతున్న మొక్కలు

వర్షాల కోసం రైతుల ఎదురుచూపులు

చినుకు జాడేది ?1
1/1

చినుకు జాడేది ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement