మళ్లీ ఆదర్శ రైతులు! | - | Sakshi
Sakshi News home page

మళ్లీ ఆదర్శ రైతులు!

Jun 6 2025 1:08 AM | Updated on Jun 6 2025 1:08 AM

మళ్లీ ఆదర్శ రైతులు!

మళ్లీ ఆదర్శ రైతులు!

● అధికారులు – రైతులకు అనుసంధానంగా వ్యవస్థ ● రైతు వేదికల నిర్వహణ సైతం అప్పగించే యోచన ● ఎంపికకు కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

బూర్గంపాడు: ఆదర్శ రైతు వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ తెరపైకి తెస్తోంది. గతంలో డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదర్శ రైతుల వ్యవస్థ తీసుకువచ్చారు. వ్యవసాయ అధికారులకు, రైతులకు మధ్య అనుసంధాన కర్తలుగా ఆదర్శ రైతులు వ్యవహరించారు. నాడు ఆదర్శరైతులకు ప్రభుత్వం గౌరవ వేతనం కూడా అందించింది. రాష్ట్ర విభజన అనంతరం ఆదర్శ రైతు వ్యవస్థను కేసీఆర్‌ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తర్వాత ఐదు వేల ఎకరాలకు ఒక రైతు వేదికను ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులో ఓ ఏఈఓను నియమించింది. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు వేదికల నుంచే రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలతో, వ్యవసాయ నిపుణులతో పంటల సాగు, యజమాన్య పద్ధతులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే రైతులకు నిరంతర సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఆదర్శ రైతులను నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

‘వేదిక’కు పది మంది..

గ్రామాలను విత్తనోత్పత్తి కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి రెవెన్యూ గ్రామంలో ప్రభుత్వం ఉచితంగా మేలురకం ఫౌండేషన్‌ సీడ్స్‌ను రైతులకు అందించి విత్తనోత్పత్తికి చర్యలు తీసుకుంటోంది. రైతులే విత్తనాలు పండించి తోటి రైతులకు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. భూసార పరీక్షలు, పంటల నమోదు, సస్యరక్షణ చర్యలు, పంటల అమ్మకాలలో ఆన్‌లైన్‌ ప్రక్రియ తదితర పనులు వ్యవసాయ అధికారులకు భారంగా మారాయి. ఈ క్రమంలో వ్యవసాయ అధికారులకు రైతులకు మధ్య వారధిగా ఉండేందుకు తిరిగి ఆదర్శ రైతులను నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఒక్కో రైతు వేదిక పరిధిలో పది మంది వరకు ఆదర్శ రైతులను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైతు వేదికల నిర్వహణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవటంతో నిర్వహణ భారం వ్యవసాయశాఖ అధికారులపై పడుతోంది. దీంతో నిధులు మంజూరు చేసి నిర్వహణ బాధ్యతలు ఆదర్శ రైతులకు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఆదర్శంగా.. పారదర్శకంగా...

ఆదర్శ రైతుల ఎంపిక ప్రక్రియ కూడా పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. నూతన సాంకేతిక పద్ధతులు అవలంబిస్తున్న రైతులను, సేంద్రియ పద్ధతుల్లో పంటలు సాగు చేస్తున్న రైతులను, బాగా చదువుకుని వ్యవసాయంపై మక్కువతో పంటలు సాగు చేస్తున్న రైతులను ఆదర్శ రైతులుగా నియమించే అవకాశాలున్నాయి. పంటల సాగుతోపాటు వ్యవసాయ అనుబంధ రంగాలలో రాణిస్తున్న రైతులను కూడా ఆదర్శరైతులుగా తీసుకోనున్నారు. గ్రామాల్లో డెయిరీ ఫామ్స్‌, ఫౌల్ట్రీ ఫామ్స్‌, గొర్రెలు, మేకల పెంపకం, తేనెటీగల పెంపకం, పుట్టగొడుగుల పెంపకం చేపట్టిన రైతులను కూడా ఆదర్శ రైతులుగా తీసుకోనున్నారు. గతంలో ఆదర్శ రైతులకు ప్రభుత్వం నెలకు రూ 1000 గౌరవ వేతనం అందించింది. ప్రస్తుతం మాత్రం గౌరవ వేతనంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనట్టుగా సమాచారం. కాగా ప్రభుత్వం ఆదర్శ రైతులను నియమించేందుకు నిర్ణయించటంతో ఆశావహులు అప్పుడే ఉత్సాహం చూపిస్తున్నారు. అధికార కాంగ్రెస్‌లో ఉన్నవారు తమను ఆదర్శ రైతులుగా తీసుకోవాలని స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులను కలిసి విన్నవించుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement