వైరా: వైరా శాంతినగర్లోని న్యూ లిటిల్ ఫ్లవర్స్ పాఠశాలలో పది రోజులుగా నిర్వహిస్తున్న ఎన్సీసీ శిబిరం శుక్రవారంతో ముగిసింది. ఎన్సీసీ ఆఫీసర్లు కల్నల్ ఎస్.కే.భద్ర, కల్న ల్ నవీన్ యాదవ్ నేతృత్వాన కేడెట్లకు దేశభక్తి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాల పెంపు, శారీరక ధృడత్వం తదితర అంశాలపై తర్ఫీదు ఇచ్చారు. ఈ సందర్భంగా చివరిరోజు భద్ర, నవీన్యాదవ్ మాట్లాడుతూ దేశ రక్షణలో సైన్యం పాత్రపై అవగాహన కల్పించారు. అనంతరం వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన కేడెట్లకు బహుమతులు అందించగా, అధికారులకు న్యూలిటిల్ ఫ్లవర్స్ పాఠశాల కరస్పాడెంట్ డాక్టర్ పి.భూమేష్ జ్ఞాపికలు అందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఆఫీసర్ సీహెచ్.అపురూపాదేవి, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులకు ముగిసిన శిక్షణ
ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఇస్తున్న శిక్షణ శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా డీఈఓ ఎస్.సత్యనారాయణ మాట్లాడుతూ విద్యాశాఖ ఆధ్వర్యాన 15 రోజులుగా మూడు దశల్లో శిక్షణ ఇచ్చామని తెలిపారు. ఈ మేరకు డీఈఓ, రిసోర్స్ పర్సన్లను పలువురు సన్మానించారు. ఏఎంఓ రవికుమార్ పాల్గొన్నారు.
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
సత్తుపల్లి/వేంసూరు: పంటల సీజన్ మొదలైన నేపథ్యాన ఎవరైనా అనుమతి లేని, నకిలీ విత్తనాలు అమ్మితే కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా వ్యవసాయ శాఖాధికారి డి.పుల్లయ్య హెచ్చరించారు. సత్తుపల్లి పట్టణంతో పాటు వేంసూరు మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఆయన విత్తనాల షాపుల్లో తనిఖీ చేశారు. షాప్లు, ప్రాసెసింగ్ యూనిట్లు, ట్రాన్స్పోర్టు కార్యాలయాలను పోలీస్ అధికారులతో కలిసి తనిఖీ చేయగా డీఏఓ మాట్లాడారు. నకిలీ విత్తనాలు అంటగట్టి రైతులను మోసం చేయాలని ప్రయత్నిస్తే చర్యలు తప్పవని తెలిపారు. రైతులు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. తనిఖీల్లో ఏడీఏ శ్రీనివాసరెడ్డి, ఏఓలు శ్రీనివాసరావు, రామ్మోహన్, ఏస్సైలు రఘు, అశోక్, ఏఈఓలు కావ్య, నవ్య, రీమా, స్వాతి, అక్షర తదితరులు పాల్గొన్నారు.
గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న ముగ్గురి అరెస్ట్
ముదిగొండ: ముదిగొండలోని పారిశ్రామిక ప్రాంతంలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సీఐ ఓ.మురళి తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఉమేష్కుమార్, రింకూ కుమార్ ముదిగొండ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. ఇటీవల వారు స్వగ్రామం నుండి గంజాయి చాక్లెట్లు తీసుకొచ్చి పలువురికి అమ్ముతున్నట్లు తెలిసింది. ఈక్రమంలోనే శుక్రవారం గుమ్మడిద సత్యనారాయణ కిరాణా షాపు వద్ద అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా 280 గంజాయి చాక్లెట్లు లభించాయి. దీంతో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు.
12 మంది మైనర్లకు జరిమానా
ఖమ్మంక్రైం: వాహనాలు నడిపిన 12మంది మైనర్లకు రూ.200 చొప్పున జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించిందని ఖమ్మం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు తెలిపారు. ఇటీవల ఖమ్మంలో చేపట్టిన తనిఖీల్లో వాహనాలు నడుపుతూ పట్టుబడిన మైనర్లపై కేసు నమోదు చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరిచామని పేర్కొన్నారు. దీంతో వారికి జరిమానా విధిస్తూ ఖమ్మం మొదటి అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ బి.రజని తీర్పు చెప్పారని వెల్లడించారు. తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, తల్లిదండ్రులెవరూ పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని సూచించారు.