
విపత్తు వేళ ప్రణాళికే కీలకం
ఖమ్మం సహకారనగర్: ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు ప్రణాళికాయుతంగా పనిచేస్తే ప్రజల ప్రాణాలతో విలువైన ఆస్తులు నష్టపోకుండా కాపాడొచ్చని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం ఆయన వివిధ శాఖల అధికారులతో పాటు ‘ఆపద మిత్ర’లుగా ఎంపిక చేసిన వారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత ఏడాది వరద వచ్చిన సమయాన అందరూ సమష్టిగా పనిచేయడంతో అతి తక్కువ ప్రాణ నష్టంతో బయటపడడమే కాక 15రోజుల వ్యవధిలో సాధారణ పరిస్థితికి తీసుకొచ్చామని తెలిపారు. ఈసారి కూడా మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో వర్షం వివరాలు ఎప్పటిప్పుడు తెలుసుకుంటూ, వరద వచ్చే అవకాశముంటే గ్రామం నుంచి జిల్లా వరకు వివిధ స్థాయిల్లో వాట్సాప్ గ్రూపుల ద్వారా సమాచారం చేరవేస్తామని చెప్పారు. అంతేకాక కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ నుంచి సంబంధిత ప్రాంతాలకు సమాచారం చేరవేసి రెస్క్యూ బృందాలతో పాటు వలంటీర్లను రంగంలోకి దించాల్సి ఉంటుందని చెప్పారు. అయితే, ముందస్తుగా శిథిలావస్థకు చేరిన ఇళ్లు, ఒంటరి మహిళలు, వృద్ధులను గుర్తించాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకుబ్యాగ్లు పంపిణీ చేసి ముఖ్యమైన పత్రాలు, ఆభరణాలు భద్రపర్చుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆపద మిత్రలకు కలెక్టర్ సామగ్రి అందజేశారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ సన్యాసయ్య, సీపీఓ ఏ.శ్రీనివాస్, విద్యుత్ ఎస్ఈ శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ముజమ్మిల్ఖాన్