
విద్యుత్ ఫీడర్లపై ఇండికేటర్లు
● అంతరాయం ఏర్పడిన భాగాన్ని గుర్తించేలా ఏర్పాటు ● 18 ఫీడర్ల పరిధిలో 79 ప్రదేశాల్లో ఏర్పాటుకు కసరత్తు ● ఇప్పటికే మధిర – ఎర్రుపాలెం లైన్లో పనులు
ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ వ్యవస్థ సాంకేతికంగా అభివృద్ధి చెందుతోంది. మెరుగైన సరఫరా, అంతరాయాలను నియంత్రించడమే లక్ష్యంగా సంస్థ ‘ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్ల’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర సాంకేతిక కారణాలతో లైన్లలో తరచుగా అంతరాయం ఏర్పడుతుంది. ఈ సమయాన లైన్ మొత్తాన్ని తనిఖీ చేయకుండా బ్రేక్ డౌన్ అయిన ప్రాంతాన్ని గుర్తించేలా ఈ ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్(ఎఫ్పీఐ)లు ఉపయోగపడతాయి. వీటిని 33 కేవీ, 11 కేవీ విద్యుత్ ఫీడర్లపై ఏర్పాటు చేస్తుండడంతో సమస్య ఎదురైన ప్రాంతాన్ని గుర్తించి నేరుగా అక్కడకే వెళ్లి మరమ్మతు చేయనుండడంతో ఉద్యోగులపై భారం తగ్గుతుంది. అంతేకాక త్వరగా సరఫరా పునరుద్ధరించడానికి వీలవుతుంది.
మొదలైన పనులు
జిల్లాలో 18 విద్యుత్ ఫీడర్లలో సాంకేతికంగా అవసరమైన 79 ప్రదేశాల్లో ఎఫ్పీఐల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈమేరకు జిల్లాలోని మధిర నుంచి ఎర్రుపాలెం వరకు 40 కి.మీ. పొడవైన 33 కేవీ విద్యుత్ లైన్లో గుర్తించిన ప్రదేశాల్లో ఐదు ఇండికేటర్లు, జానకీపురం నుంచి వెలువడే గ్లొపూడి ఫీడర్లో మరో ఐదు ఇండికేటర్ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ఖమ్మం సర్కిల్లో గుర్తించిన ఇతర ప్రాంతాల్లోనూ ఇండికేటర్ల ఏర్పాటుకు కసరత్తు సాగుతుండగా ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారితో కూడిన అధికారుల బృందం పర్యవేక్షిస్తుంది. ఈ సందర్బంగా ఎస్ఈ మాట్లాడుతూ విద్యుత్ అంతరాయం ఏర్పడిన భాగాన్ని త్వరగా గుర్తించేలా ఎఫ్పీఐలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తద్వారా విద్యుత్ వినియోగదారులకు ఉత్తమ సేవలతో పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరాకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు.