
దివ్యాంగుడిని ఆదుకోండి..
మధిర: రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబంలో జన్మించిన దివ్యాంగుడిని ఆదుకోవాలని ఆయన తల్లి కోరుతోంది. మధిర ఎంప్లాయీస్ కాలనీకి చెందిన ముత్తారపు చిరంజీవి – శారద దంపతులకు దివ్యాంగుడైన కుమారుడు శ్రీనివాస్, కుమార్తె శివాని ఉన్నారు. చిరంజీవి కొన్నేళ్లుగా ఆటో అద్దెకు తీసుకుని నడిపిస్తుండగా, ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో ఉపాధి దూరమైంది. దీంతో శివాని చదువు భారంగా మారింది. దీనికి తోడు దివ్యాంగుడైన శ్రీనివాస్కు వచ్చే రూ 4వేల పెన్షన్ ఆయన బాగోగులకు సరిపోవడం లేదని చిరంజీవి దంపతులు వాపోతున్నారు. పుట్టుకతో కాళ్లు, చేతులు పనిచేయని శ్రీనివాస్కు 28ఏళ్లు వచ్చినా ఏ పని చేసుకోలేని స్థితి కావడంతో ఎవరో ఒకరు పని మానుకుని ఇంటి వద్దే ఉండాల్సి వస్తోంది. కనీసం సొంత ఇల్లు కూడా లేని తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడమే కాక, కేర్ టేకర్ వేతనం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.