
కులగణనకు బీజాలు వేసింది మేమే..
● కేంద్రం దేశవ్యాప్తంగా చేపట్టడం మా ప్రభుత్వ విజయం ● రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
ఖమ్మంవన్టౌన్/ఖమ్మం సహకారనగర్: రాష్ట్రంలో కులగణన చేటప్టడం ద్వారా దేశానికే తమ ప్రభుత్వం రోల్మోడల్గా నిలిచిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. తమ ఒత్తిడి ఫలితంగానే కేంద్రం తలొగ్గి దేశవ్యాప్తంగా కులగణనకు నిర్ణయించిందని తెలిపారు. ఖమ్మంకు శనివారం వచ్చిన ఆయనకు బీసీ కుల సంఘాల, ఉద్యోగ సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపి సన్మానించారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్గాంధీ ఆదేశాలతో రాష్ట్రంలో కులగణన సర్వే చేపట్టి, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించేలా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామన్నారు. గుజరాత్లో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలోనూ తెలంగాణ మాదిరి దేశమంతటా కులగణన సర్వే చేయాలని తీర్మానం చేసి పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు గళమెత్తారని తెలిపారు. ఫలితంగా కేంద్రం దిగొచ్చి కులగణన చేస్తామని ప్రకటించిందని చెప్పారు. కులగణన సర్వేలో కులాల వివరాలే కాకుండా ప్రజల సామాజిక, రాజకీయ, ఆర్థిక, జీవన ప్రమాణాలను సైతం తీసుకున్నామని... తద్వారా రాష్ట ప్రభుత్వం తీసుకునే విధానపరమైన ఈ అంశాలు ఉపయోగపడతాయని భట్టి విక్రమార్క వెల్లడించారు.
ఉద్యోగులకు అండగా ప్రభుత్వం
అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు తమకు వెన్నుదన్నుగా నిలిచారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గత పాలకులు చేసిన తప్పిదాలతో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైనందున, దాన్ని సవరించే క్రమంలో సమస్యల పరిష్కారానికి జాప్యం జరుగుతోందని చెప్పారు. అయినా పెండింగ్ సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తున్నామని, ఉద్యోగులెవరూ అధైర్యపడి పక్కదారులు పట్టి ఇబ్బందులకు గురి కావొద్దని సూచించారు. ఈ కార్యక్రమాల్లో ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ సైదులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కుల సంఘాల నాయకులు గండు యాదగిరి, మన్సూర్, పోతగాని వెంకన్న, బెజ్జంకి ప్రభాకరాచారి, ఎర్రమళ్ల శ్రీనివాస్, చంద్రశేఖర్గౌడ్, బచ్చల పద్మాచారి, సున్నం రమేష్, పాపారావు, నవీన శ్రీనివాస్, వెంకన్నయాదవ్, రవీంద్రప్రసాద్, వెంకట రామకృష్ణ, జయపాల్, ఎర్రా రమేష్, మల్లెల రవీంద్రప్రసాద్, జడ్.ఎస్.జయపాల్ విజయకుమార్, సగుర్తి ప్రకాష్రావు, ఎర్ర రమేష్, పర్వతపు శ్రీనివాస్, రవికుమార్, కె.రుక్మారావు, ఎస్.లలితకుమారి తదితరులు పాల్గొన్నారు.