
రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత
రాయచూరు రూరల్: యాదగిరి నగరంలో రోడ్ల నిర్మాణం, అభివృద్ధికి ప్రాధాన్యత కల్పిస్తామని నగరసభ అధ్యక్షురాలు లలిత అనాపూరె పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని గాంధీనగర్ తాండాలో చేపట్టిన సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టి ఆమె మాట్లాడారు. జిల్లా కేంద్రమైన యాదగిరిలో నాణ్యతతో కూడిన రోడ్ల నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఎక్కువ కాలం మన్నిక వచ్చే విధంగా నాణ్యతగా రోడ్లను నిర్మించాలన్నారు. వర్షాలు మొదలయ్యేలోగా రోడ్ల నిర్మాణపు పనులను పూర్తి చేయాలని ఆమె సూచించారు.
పేకాటరాయుళ్ల అరెస్ట్
హుబ్లీ: జిల్లాలోని కుందగోళ తాలూకా రట్టిగేరి గ్రామ శివారు ప్రాంతంలో పేకాట ఆడుతున్న 6 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు సదరు అడ్డాపై దాడి చేసి ఆరుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.13,200 నగదు, పేకాట సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ ఘటనపై కేసు దర్యాప్తులో ఉందని, పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు గుడిగేరి పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.
పరిహారం పంపిణీ
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా సిరవార తాలూకా గుడదిన్నిలో ఇటీవల పిడుగుపాటుకు గురై మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి మంగళవారం మంత్రి బోసురాజు, మాన్వి ఎమ్మెల్యే హంపయ్య నాయక్ రూ.5 లక్షల పరిహారధనం చెక్ను మృతుడు సాయణ్ణ తల్లికి అందించి సానుభూతిని తెలిపారు. వారి వెంట తహసీల్దార్ రవి, నేతలు కరిలింగప్ప, సిద్దనగౌడ, శ్రీనాథ్లున్నారు.
నకిలీ నోట్ల చెలామణి
నిందితుల అరెస్ట్
రాయచూరు రూరల్: నకిలీ కరెన్సీ నోట్లను చెలామణి చేస్తున్న 10 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన సోమవారం జిల్లాలోని మాన్వి తాలూకాలో జరిగినట్లు సీఐ సోమశేఖర్ ఎస్ కెంచరెడ్డి తెలిపారు. గత నెల 13న ఇండియన్ బ్యాంక్లోని ఏటీఎం కేంద్రంలో సీకల్కు చెందిన విరుపాక్షి తమ ఖాతాలోకి 35 నకిలీ రూ.500 నోట్లను చేర్చి రూ.18 వేలను జమ చేశాడన్నారు. ఈ విషయంపై విచారణ చేపట్టి సీకల్ విరుపాక్షి, శేఖర్, హుసేన్ బాషా, మాచనూరు ఖాజాహుసేన్, సిరవార సిద్దనగౌడ, అమరేష్, మాన్వి అజ్మీర్, సింధనూరు ఆలం బాషా, రాయచూరు నరసయ్య శెట్టి, కారటిగి భీమేష్లను అరెస్ట్ చేశామన్నారు.
నకిలీ రికార్డుల దహనం
● ముగ్గురు అధికారుల సస్పెండ్
రాయచూరు రూరల్: నకిలీ రికార్డులను తయారు చేసి వాటిని తగులబెట్టిన అధికారులను సస్పెండ్ చేసిన ఘటన యాదగిరి నగరసభలో చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆస్తులను ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసిన యాదగరి నగరసభ రెవిన్యూ అధికారి మానప్ప బడిగేర, ఇంచార్జి రెవిన్యూ అధికారి మైనుద్దీన్ మహ్మద్ హజరత్, శహాపుర నగరసభ నీటి సరఫరా సూపర్వైజర్ హన్మంతప్పలను అరెస్ట్ చేశారు. యాదగిరిలో సర్వే నంబర్–151లో 42వ ఇంటి నంబర్ మల్లమ్మ రామణ్ణ పేరు మీద ఉన్న దానిని ఈ ముగ్గురు అధికారులు జూన్ 1న నగరసభ కార్యాలయంలోకి ప్రవేశించి రికార్డులను తారుమారు చేసినట్లు వాస్తవాలు వెల్లడి కావడంతో వారిని విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు యాదగిరి నగరసభ కమిషనర్ చౌహాన్ తెలిపారు.
ఘనంగా కరుణానిధి జయంతి
కేజీఎఫ్: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి 101వ జయంతిని మంగళవారం నగరంలో ఘనంగా నిర్వహించారు. గాంధీ సర్కల్ వద్ద డీఎంకే కార్యకర్తలు కరుణానిధి ఫ్లెక్సీకి పూలదండలు వేసి నివాళులర్పించారు. గౌరవాధ్యక్షుడు మునిరత్నం మాట్లాడుతూ కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. చక్రపాణి, ఏసు, కణ్ణన్, రవీంద్ర, మురుగన్, శివ తదితరులు పాల్గొన్నారు.

రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత

రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత

రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత