
రోడ్డెక్కిన మామిడి రైతులు
శ్రీనివాసపురం : సీజన్ ప్రారంభంలోనే ధరలు తగ్గడంతో మామిడి రైతులు రోడ్డెక్కారు. మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ మామిడి ఉత్పత్తిదారుల క్షేమాభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని ఇందిరా సర్కిల్ వద్ద ప్రతిఘటన నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు నీలటూరు చిన్నప్పరెడ్డి మాట్లాడుతూ శాశ్విత నీటిపారుదల సౌలభ్యాలు లేని తాలూకాలో రైతులు బోర్ల కింద మామిడి పంట సాగు చేశారన్నారు. సీజన్లోనే ధరలు తగ్గడంతో రైతులు నష్టపోతున్నారన్నారు. టన్ను మామిడి రూ.3 వేల నుంచి రూ.4 వేలకు మాత్రమే ధర పలుకుతోందని. ఈ ధరలు కూలి కార్మికులకు, ట్రాక్టర్ బాడుగలకు కూడా సరిపోవన్నారు. మామిడి పంటతో లాభాలు పొందవచ్చని భావించిన రైతుల కలలు కల్లలు అవుతున్నాయన్నారు. మామిడి రైతుల కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం మామిడికి మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పాతకోట నవీన్ కుమార్, ఉపాధ్యక్షుడు భైరెడ్డి పాల్గొన్నారు.
టమాట, మామిడి రైతులను ఆదుకోండి
కోలారు : టమాట, మామిడికి మద్దతు ధర ప్రకటించాలని రైతు సంఘం పదాధికారులు డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం ఉప విభాగాధికారి డాక్టర్ మైత్రికి వినతిపత్రం సమర్పించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.నారాయణగౌడ మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి, ప్రజా ప్రతినిధులు తీవ్ర నిర్లక్ష్య ధోరణిని అనుసరిస్తున్నారు. లక్షలు ఖర్చుచేసి పండించిన టమాట, మామిడికి ధరలు లేక అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం స్పందించి మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు ఈకంబళ్లి మంజునాథ్, మరగల్ శ్రీనివాస్, మంగసంద్ర తిమ్మణ్ణ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డెక్కిన మామిడి రైతులు