
చిన్నారుల్లో నేర ప్రవృత్తి విశృంఖలం
హుబ్లీ: ఇటీవల పిల్లల్లో నేర ప్రవృత్తి పెరుగుతోంది. దీనిపై తల్లిదండ్రుల పాత్ర గురించి మనోవైద్యులు, పోలీస్ అధికారులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. మద్యం తాగిన మత్తులో గాని, మత్తు పదార్థానికి బానిసలైనప్పుడు గొడవ జరగడం పర్యవసానంగా హత్యకు దారి తీయడం అక్కడక్కడ జరుగుతున్నాయి. మూడు రోజుల క్రితం వాణిజ్య నగరి హుబ్లీలో చిన్న కారణంగా 13 ఏళ్ల బాలుడు తనకన్నా మూడేళ్లు పెద్దవాడైన మరో బాలుడిని చాకుతో దాడి చేసి హత్య చేసిన ఘటన సర్వత్ర ఆందోళన కలిగించిన సంగతి తెలిసిందే. చిన్న పిల్లలు తెలిసో తెలియకో హత్య వరకు ఎలా వెళుతున్నారు. పిల్లల మనోగతంలో ఇంత క్రౌర్యం కలగడానికి కారణం ఏమిటి? ఈ విషయంలో తల్లిదండ్రుల పాత్ర ఏమిటి? అన్న దానిపై సమాధానంగా పిల్లల పరివర్తన ఎలా ఉంటుందన్న దాని గురించి మనోవైద్యులు, పోలీస్ అధికారులు పలు సూచనలు చేశారు. ఇటీవల హుబ్లీ ధార్వాడ నేర, ట్రాఫిక్ విభాగం డీసీపీ సీఆర్ రవీష్ మాట్లాడుతూ తన 30 ఏళ్లకు పైగా వృత్తి జీవితంలో ఇలాంటి ఘటన తొలిసారిగా చూశానన్నారు. 13 ఏళ్ల బాలుడు హత్య చేయడం అత్యంత ఆవేదన కలిగించే ఘటన అన్నారు. పిల్లలను బాగా పెంచడం ప్రతి తల్లిదండ్రి ప్రథమ కర్తవ్యం అన్నారు.
వేప విత్తనానికి తేనె పోస్తే విషం పోతుందా?
వేప విత్తనానికి బెల్లం, పాలు, తేనె పోసినంత మాత్రాన వేపలోని విషం పోతుందా? అంటూ వేప ఎప్పటికై నా తియ్యదనం ఇస్తుందా? అని బసవణ్ణ వచనాన్ని ఉదాహరణగా వివరించారు. పిల్లల ఎదుగుదల తదితర బాధ్యత తల్లిదండ్రులదేనన్నారు. తల్లిదండ్రులు పిల్లలతో నడుచుకొనే తీరు వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. దీనికి తోడు మొబైల్, టీవీలు, సినిమాల్లో నేరాలు, ఘోరాలను వైభవీకరించడం వల్ల సుతిమెత్తని చిన్నారుల మనసుపై పరిణామం చోటు చేసుకుంటుందన్నారు. పిల్లల మనసు మొగ్గలాంటిది. తల్లిదండ్రులు వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. పిల్లలు రోజు ఎక్కడికి వెళుతున్నారు? ఏం చేస్తున్నారు? అన్నదాంతో పాటు అసహజ వ్యక్తిత్వాన్ని గమనిస్తూ వాటికి పరిష్కారం కల్పించేందుకు కృషి చేయాలన్నారు. ముఖ్యంగా పిల్లల్లో తల్లిదండ్రులు దుర్గుణాలను తగ్గేలా చూడాలన్నారు. నైతిక, నీతి పాఠాలను వివరించి చెప్పాలన్నారు. పబ్జీ, బ్లూగేమ్స్ వంటి ఆన్లైన్ ఆటలు చిన్నారి పువ్వులాంటి మనసుపై ముల్లులాంటి క్రౌర్యాన్ని కలిగిస్తుందన్నారు. అందుకే పిల్లలకు మొబైల్, ల్యాప్టాప్లో ఏం చేస్తున్నారో సదా గమనించి మంచి చెడ్డలను వివరించాలన్నారు.
పిల్లలపై ఇంటి వాతావరణ ప్రభావం
మనోవైద్యుడు డాక్టర్ శివానంద హిరేమఠ మాట్లాడుతూ 13 ఏళ్ల బాలుడు హత్య ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఇటీవల పిల్లల్లో అమాయకత్వం తగ్గిపోతోందన్నారు. సోషల్ మీడియా, సినిమాలోని హింసను భారీగా చూపడం వంటి దృశ్యాలు చిన్నారుల మనసులను కనిష్టం చేస్తున్నాయన్నారు. తమ చుట్టు పక్కల తమ కన్నా పెద్దలు అలాంటి ప్రవృత్తిలో ఉంటే వారినే పిల్లలను అనుసరిస్తారు. ఇంట్లోని వాతావరణంలో తల్లిదండ్రుల మధ్య జగడాలు వంటి కారణాలు పిల్లలపై తీరని ప్రభావం చూపుతాయన్నారు. ఈ విషయాలపై తల్లిదండ్రులు సదా జాగృతంగా ఉండి తమ పిల్లలకు అవసరమైనప్పుడు కౌన్సిలింగ్, థెరపీ ద్వారా సమస్యలను పరిష్కరించాలి. ఆన్లైన్ ఆటలలో హింసాత్మక ప్రవృత్తి నానాటికి పెరుగుతున్న కారణంగా ప్రభుత్వం, తల్లిదండ్రులు వాటి నుంచి దూరంగా ఉంచే పని చేయాలి. తండ్రే ఆ కుటుంబ ఆదర్శ వ్యక్తిగా ఉత్తమ నడత కలిగి ఉండాలి. కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మదితో కూడిన వాతావరణ కౌటుంబిక సౌహార్ధ ఉండాలి. తండ్రి తమ పిల్లలకు తగిన సమయాన్ని కేటాయించి పిల్లలతో చక్కటి అనుబంధాన్ని పాదుగోల్పేలా తమ తీరును తల్లిదండ్రులు మార్చుకుంటే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.
పిల్లలను మంచిగా పెంచడం
తల్లిదండ్రుల బాధ్యత
మనో వైద్యులు, పోలీస్ అధికారుల సలహా సూచనలు

చిన్నారుల్లో నేర ప్రవృత్తి విశృంఖలం