
కరావళి, మలెనాడులో కుంభవృష్టి
బనశంకరి: రాష్ట్రంలో కరావళి, మలెనాడు, కావేరి జలానయన ప్రదేశాల్లో కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో నలుగురు మృత్యవాత పడ్డారు. దక్షిణ కన్నడ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో రెండు రోజుల పాటు అంగన్వాడీ, పాఠశాలలు, కాలేజీలకు జిల్లా యంత్రాంగం సెలవు ప్రకటించింది. ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు, పీయూ కాలేజీలకు సెలవు ప్రకటిస్తూ దక్షిణ కన్నడ జిల్లా కలెక్టర్ ముల్లై ముగిలన్ ఆదేశాలు జారీ చేశారు. కరావళి, మలెనాడు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కన్నడ జిల్లాలో వివిధ తాలూకాల్లో ఎడతెరపి లేని వర్షాలు పడుతున్నాయి. మంగళూరు పంప్వేల్ పై వంతెన పూర్తిగా జలమయమైంది. మంగళూరు కొడియాల్బైల్ భగవతినగర ద్వీపంగా మారింది. భారీ వర్షాల కారణంగా రాజ కాలువలోని నీరు జనవసతి ప్రదేశాల్లోకి చొరబడి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది.
త్రుటిలో తప్పిన ప్రాణాపాయం
దక్షిణకన్నడ జిల్లాలో భారీ వృక్షం కారుపై పడటంతో నలుగురు ప్రాణాపాయం నుంచి త్రుటిలో బయటపడ్డారు. ఈ ఘటన కడబ తాలూకా రామకుంజలో సంభవించింది. అబ్దుల్ సలీం, రామకుంజ రోడ్డు వీధిలో మారుతీ కారును పార్కింగ్ చేసి వెళ్లారు. ఒక్కసారిగా మామిడి చెట్టు శబ్దం విని కారులో నుంచి కిందికి దిగి బయటకు వెళ్లారు.
30 వరకు వర్షాలు
ఈనెల 30వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉడుపి జిల్లాలో వర్షాలు తీవ్రరూపం దాల్చడంతో పడుకెరె సముద్ర తీరంలో భారీగా అలలు ఎగిసి పడుతున్నాయి. తీరప్రాంతాల్లో నివాసులను జిల్లా యంత్రాంగం హెచ్చరించింది. చిక్మగళూరు జిల్లాలో భారీ వర్షాలతో ప్రజలు పలు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. మూడిగెరె తాలూకా బాళూరు గ్రామం ఎస్టేట్లో అర్దరాత్రి కార్మికుడి ఇంటిపై భారీ చెట్టు కూలిపోవడంతో సునంద అనే మహిళ తీవ్రంగా గాయపడింది. 20 మంది కార్మికులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. హాసన జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండగా సకలేశపుర అనేమహల్ వద్ద రహదారిలో మట్టి కుంగిపోవడంతో వాహనదారులు భయం భయంగా సంచరిస్తున్నారు.
కూలిపోయిన హోటల్ గోడ
సకలేశపురలో మలెనాడు కెఫె హోటల్ గోడ కూలిపోయింది. నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. శిరాడీఘాట్ రోడ్డులో రెండు వైపులా భూమి కుంగిపోయింది. వర్షంతో 100 అడుగుల ఎత్తుగల కొండ కూలిపోతుందనే భయం ఏర్పడింది. హసన తాలూకా బాగే సమీపంలోని అరసు నగరలో భారీవర్షంలో కారు డ్రైవింగ్ చేస్తూ డివైడర్కు డీకొట్టడంతో కారు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. బెంగళూరు దాసరహళ్లికి చెందిన శరత్(28), అభిషేక్(27) మృతులు. కొడగు జిల్లా విరాజపేటె తాలూకా మాల్దారెలో ఇంటి వద్ద పని చేస్తుండగా చెట్టు కొమ్మ విరిగి పడటంతో విష్ణుబెల్లప్ప తీవ్రంగా గాయపడ్డారు. అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఉడుపి, ఉత్తరకన్నడ, దక్షిణకన్నడ, శివమొగ్గ, చిక్మగళూరు, కొడగు జిల్లాలకు 5 రోజులు రెడ్అలర్ట్ ప్రకటించారు. బీదర్, కలబురిగి, యాదగిరి, విజయపుర, బెళగావి జిల్లాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
కేఆర్ఎస్లోకి మూడు అడుగుల మేర నీరు
కావేరి జలానయన ప్రదేశంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గత 24 గంటల్లో కేఆర్ఎస్లో మూడు అడుగుల మేర నీరు పెరిగింది. పాతమైసూరు ప్రాంతానికి జీవనాడిగా ఉన్న మండ్య జిల్లా శ్రీరంగపట్టణ తాలూకా కేఆర్ఎస్ ఆనకట్టలో ఇన్ఫ్లో పెరిగింది. ఒకేరోజు మూడు అడుగుల నీరు చేరింది. రెండు రోజుల క్రితం జలాశయానికి 350 క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉండగా కావేరి జలానయన ప్రదేశంలో భారీ వర్షాలతో మంగళవారం 19,129 క్యూసెక్కుల నీరు చేరింది. ముంగారు ప్రారంభంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో రైతుల ముఖాల్లో ఆనందం నెలకొంది.
భారీ వర్షాలతో ముగ్గురి మృతి
పలు జిల్లాల్లో ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాలు
కూలుతున్న ఇళ్లు, వృక్షాలు
దక్షిణ కన్నడ జిల్లాలో
నలుగురికి తప్పిన ప్రమాదం
కేఆర్ఎస్లోకి వరద జలాలు

కరావళి, మలెనాడులో కుంభవృష్టి

కరావళి, మలెనాడులో కుంభవృష్టి

కరావళి, మలెనాడులో కుంభవృష్టి

కరావళి, మలెనాడులో కుంభవృష్టి

కరావళి, మలెనాడులో కుంభవృష్టి

కరావళి, మలెనాడులో కుంభవృష్టి