
రాష్ట్రాభివృద్ధికి సీఎం బద్ధ వ్యతిరేకి
రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాలకు తోడు రాష్ట్రాభివృద్ధికి బద్ధ వ్యతిరేకి ముఖ్యమంత్రి సిద్దరామయ్య అని బీదర్ దక్షిణ క్షేత్రం శాసన సభ్యుడు శైలేంద్ర బేల్దాళ్ ఆరోపించారు. సోమవారం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నీతి ఆయోగ్ సమావేశాలకు హాజరైనా కర్ణాటక నుంచి ఏ ఒక్క ప్రతినిధీ హాజరు కాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. నిధుల మంజూరులో కేంద్రం రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమను చూపుతోందని కేంద్రం వైపు వేలెత్తి చూపడాన్ని ఖండించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్రల ముఖ్యమంత్రులు పాల్గొన్నా కర్ణాటక నుంచి సమావేశాలకు వెళ్లక పోవడం సరికాదన్నారు. వికసిత భారత్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను గురించి వివరించారు.
అధిక ఫీజుల వసూలు తగదు
రాయచూరు రూరల్: రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల్లో 2025–26వ విద్యా సంవత్సరంలో అధికంగా డొనేషన్లు, ఫీజులు వసూలు చేయడం తగదని ఎస్ఎఫ్ఐ పేర్కొంది. సోమవారం రాష్ట్ర విద్యా శాఖ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు అమరేష్ మాట్లాడారు. మధ్య తరగతి పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదవాలంటే రూ.లక్షల్లో డొనేషన్లు, వేలల్లో ఫీజు వసూలు చేస్తున్నా జిల్లా, తాలూకా విద్యాశాఖ అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరించడాన్ని ఖండించారు. అధిక ఫీజులు వసూలు చేసే పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి రితీక్ కుమార్, కమిషనర్ కావేరిలకు వినతిపత్రం సమర్పించారు.
నకిలీ హెర్బల్ న్యూట్రీషన్లను అరికట్టాలి
రాయచూరు రూరల్: జిల్లాలో అధికమవుతున్న నకిలీ హెర్బల్ న్యూట్రీషన్ విక్రయాలను అరికట్టాలని జనసేవా ఫౌండేషన్ డిమాండ్ చేసింది. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంఘం అధ్యక్షుడు జావిద్ఖాన్ మాట్లాడారు. మాన్విలో హెర్బల్ న్యూట్రీషప్ అంగడి యజమాని కళ్యాణ్, భార్య అంబికా నకిలీ హెర్బల్ న్యూట్రీషన్లను విక్రయిస్తున్నారని, లైసెన్సులను రద్దు చేసి, నకిలీ హెర్బల్ న్యూట్రీషనలను కొనుగోలు చేయకుండా అడ్డుకట్ట వేయాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.
ఆల్మట్టికి పోటెత్తిన వరద
● 52,650 క్యూసెక్కుల నీరు రాక
రాయచూరు రూరల్: రుతుపవనాల ప్రభావంతో ఎగువ భాగంలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదిపై బాగలకోటె జిల్లాలో నిర్మించిన ఆల్మట్టి డ్యాంలోకి 52,650 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. విజయపుర, బాగలకోటె, యాదగిరి, రాయచూరు జిల్లాల జీవనాడి కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది. నారాయణపుర డ్యాంలో 14 టీఎంసీల నీరు నిల్వ ఉన్నాయి. మే నెలాఖరు నాటికి డ్యాంలోకి నీరు చేరడం ఇదే ప్రథమమని అధికారులు చెబుతున్నారు. మలప్రభ నదిలో కూడా వరద అధికం అయింది.

రాష్ట్రాభివృద్ధికి సీఎం బద్ధ వ్యతిరేకి

రాష్ట్రాభివృద్ధికి సీఎం బద్ధ వ్యతిరేకి