
వారేమైనా అంత నిజాయితీపరులా?
మైసూరు: బీజేపీ నాయకులపై ఎందుకు ఈడీ అధికారులు దాడి చేయడం లేదు, వారేమైనా అంత నిజాయితీపరులా? అని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈడీపై మండిపడ్డారు. శుక్రవారం చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని మలెమహదేశ్వర బెట్టలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి ఇంటిపై ఈడీ అధికారులు దాడి చేయడం కేవలం రాజకీయ కుట్ర అని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకు ఈడీ అధికారులు కాంగ్రెస్ నాయకుల ఇళ్లపైన, ఎమ్మెల్యేల పైన దాడి చేస్తున్నారని విరుచుకు పడ్డారు. ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి ఇంటిపై కేంద్రం ఒత్తిడి మేరకే దాడి జరిగిందని ఆరోపించారు.
నా అధికారం మరింత పదిలం
చామరాజనగర జిల్లాకు ముఖ్యమంత్రిగా వస్తే అధికారం కోల్పోతారనే పుకార్లు, అనేక మూఢనమ్మకాలు కూడా ఉన్నాయన్నారు. కాని తాను చామరాజనగరకు వచ్చిన ప్రతిసారి తన అధికారం మరింత బలపడుతోందని అన్నారు. సీఎం అయిన తర్వాత 20 సార్లకు పైగా చామరాజనగరకు వచ్చానని గుర్తు చేసుకున్నారు. అయినా తన అధికారం మరింత పదిలమైంది తప్ప ఇబ్బందులు కలుగలేదన్నారు. తాను రెండోసారి ముఖ్యమంత్రిని కూడా అయ్యానన్నారు. మలెమహాదేశ్వరునికి వెండిరథ సేవ, పూజ చేశానన్నారు. గురువారం రాత్రి ఇక్కడ బస చేసి శుక్రవారం తెల్లవారు జామున మలెమహదేశ్వర స్వామి సన్నిధిలో పూజలు చేసిన తర్వాత స్వామి వెండిరథ పూజలో పాల్గొన్నానన్నారు. ప్రజలు తనకు కానుకగా ఇచ్చిన వెండిని వెండి రథ సేవకు సమర్పించానన్నారు.
ముఖ్యమంత్రి సిద్దరామయ్య మండిపాటు
మలెమహదేశ్వరునికి సీఎం వెండిరథ సేవ
చిన్నారికి నామకరణం చేసిన ముఖ్యమంత్రి