
95 మంది దొడ్డవాసులు క్షేమం
దొడ్డబళ్లాపురం: దొడ్డ తాలూకాలోని పలు గ్రామాల నుంచి మొత్తం 95 మంది కశ్మీర్కు టూర్క వెళ్లిన వారు సురక్షితంగా తిరుగు ప్రయాణమయ్యారు. వీరందరూ పంజాబ్లోని అమృత్సర్లో టూరిస్ట్ స్థలాలు చూసి శ్రీనగర్కు బయలుదేరారు. అక్కడ వారంతా విడిది చేయబోయే హోటల్ ఉగ్రవాదులు దాడి చేసిన ప్రాంతానికి దగ్గరలోనే ఉంది. సకాలంలో పహల్గాంకి చేరుకుని ఉంటే మారణహోం సాగిన బైసరన్కు వెళ్లేవారు. అయితే కశ్మీర్కు వెళ్తుండగా దారిలో ఒకచోట కొండచరియలు విరిగి పడడంతో ప్లాన్ మారింది. జమ్ములోని వైష్ణోదేవి ఆలయ దర్శనం చేసుకుని కులు మనాలికి వెళ్లిపోయామని తెలిపారు.
180 మంది క్షేమంగా రాక
దొడ్డబళ్లాపురం: కశ్మీర్లో చిక్కుకున్న 180 మంది కర్ణాటక వాసులు గురువారం ఉదయం ప్రత్యేక విమానాల ద్వారా కెంపేగౌడ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి తమ తమ ఊర్లకు వెళ్లిపోయారు.
ఉగ్రవాదులను అంతం చేయాలి: సీఎం
మైసూరు: ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా, ఏ మతానికి చెందినవారైనా, తుదముట్టించాలని, ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్ర ప్రభుత్వం చోటివ్వరాదని సీఎం సిద్దరామయ్య అన్నారు. చామరాజనగర జిల్లా హనూరు తాలూకా మలెమహదేశ్వర బెట్టలో విలేకరులతో మాట్లాడారు. గతంలో పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారన్నారు. అప్పటినుంచి విశ్రమించకుండా ఉండాల్సిందన్నారు. ఇప్పుడు కశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడిలో అమాయకులు బలైన ఘటనకు కేంద్ర ఇంటెలిజెన్స్ వైఫల్యమే కారణమని ఆరోపించారు. ఈ ఘటన అత్యంత అమానుషం, హేయం అన్నారు. మరోవైపు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా గురువారం సాయంత్రం పలు చోట్ల కాగాడాల ప్రదర్శనలు జరిగాయి.

95 మంది దొడ్డవాసులు క్షేమం