
ఆగని బాలింతల మరణాలు
హొసపేటె: ప్రభుత్వ ఎంసీహెచ్ ఆస్పత్రిలో బుధవారం సాయంత్రం విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి తాలూకా దశమాపుర గ్రామానికి చెందిన శాంత(20) అనే బాలింత మృతి చెందింది. ఆమెకు పురిటి నొప్పులు రావడంతో తల్లిదండ్రులు నగరంలోని ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఆదివారం ఆమెకు సిజేరియన్ జరిగింది. ఆమె ఆరోగ్యకరమైన ఆడశిశువుకు జన్మనిచ్చింది. అయితే బాలింత ఆరోగ్యం క్షీణించడంతో మరణించింది. ఆమె ఆరోగ్యంపై తగిన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఆమె మరణించినట్లు మృతురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంపై దర్యాప్తునకు ఆదేశించామని, కాన్పు చేసిన కాంట్రాక్టు వైద్యుడు డాక్టర్ సింధు షా, నర్సు ఎస్జే రఘునాథ్ను విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు విధుల నుంచి తొలగించామని జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ అధికారి(డీహెచ్ఓ) డాక్టర్ ఎల్ఆర్ శంకర్ నాయక్ తెలిపారు. డాక్టర్ సింధు షా ఉజ్జయిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో గైనకాలజిస్టుగా ఉన్నారు. అసైన్మెంట్ మీద ఇక్కడికి వచ్చారని, సమగ్ర దర్యాపు తర్వాతే బాలింత మృతికి కారణం తెలుస్తుందన్నారు. బాలింతకు మరేదైనా అనారోగ్యం ఉందా? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.
తాజాగా హొసపేటెలో చోటు చేసుకున్న వైనం