‘అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌’ నోటిఫికేషన్‌ | - | Sakshi
Sakshi News home page

‘అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌’ నోటిఫికేషన్‌

Jun 8 2025 12:40 AM | Updated on Jun 8 2025 12:40 AM

‘అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌’ నోటిఫికేషన్‌

‘అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌’ నోటిఫికేషన్‌

జగిత్యాలఅగ్రికల్చర్‌: పదో తరగతి పూర్తయిన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌లు వరంగా మారాయి. రెండేళ్ల కోర్సు చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఉండడంతో ఇటీవల డిమాండ్‌ పెరిగింది. ఈ కోర్సులు చేసిన తర్వాత ఉన్నత విద్యాభ్యాసం చేయాలంటే ఎంసెట్‌తో సంబంధం లేకుండా బీఎస్సీ(అగ్రికల్చర్‌) కోర్సులో చేరవచ్చు. డిప్లొమా చేసినవారికి బీఎస్సీ అగ్రికల్చర్‌లో 15 శాతం సీట్లు రిజర్వ్‌ చేస్తారు. అయితే, వీరు డిప్లొమా తర్వాత అగ్రిసెట్‌ పరీక్ష రాయాలి.

సీట్ల వివరాలు

దరఖాస్తులను బట్టి సీట్లను కౌన్సెలింగ్‌ పద్ధతిలో భర్తీ చేస్తారు. రెండేళ్ల అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలు.. 9 ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 240, మూడు ప్రైవేట్‌ కాలేజీల్లో 210 సీట్లు ఉన్నాయి. అలాగే, మూడేళ్ల అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ డిప్లోమో కళాశాలలు.. ఒక ప్రభుత్వ కళాశాలలో 20, ఒక ప్రైవేట్‌ కాలేజీలో 30 సీట్లు ఉన్నాయి. అలాగే, నాలుగేళ్ల క్రితం నూతనంగా ప్రవేశపెట్టిన రెండేళ్ల ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌ డిప్లొమా కళాశాల ఒకటి ఉండగా, అందులో 60 సీట్లున్నాయి. ఈ కళాశాల వికారాబాద్‌ జిల్లా గింగుర్తిలో ఉండగా, ఏకలవ్య ప్రైవేట్‌ కళాశాల యాజమాన్యం నిర్వహిస్తుంది. ఈ కోర్సులన్నీ కూడా ఇంగ్లిష్‌ మీడియంలో చదవాల్సి ఉంటుంది. అలాగే, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో రెండు పాలిటెక్నిక్‌ కళాశాలలు ఉండగా, ఒకటి జగిత్యాల జిల్లా పొలాస, రెండోది కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట(బాలురు)లో ఉన్నాయి. ప్రతీ అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో 20 సీట్లు మాత్రమే ఉండగా, ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో కలిపి మొత్తం 560 సీట్లు ఉన్నాయి.

అర్హత వివరాలు

ఈ ఏడాదికి గాను అగ్రికల్చర్‌, ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌, అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా కోర్సులకు సంబంధించి నోటిఫికేషన్‌ శనివారం విడుదలైంది. ఈ కోర్సులు చదివేందుకు పదో తరగతి చదివి, పాలిసెట్‌–2025 అగ్రికల్చర్‌ విభాగంలో పరీక్ష రాసినవారు అర్హులు. మున్సిపల్‌ ఏరియాలో కాకుండా గ్రామీణ ప్రాంతాలు లేదా ప్రభుత్వ పాఠశాలలు లేదా గురుకులాల్లో నాలుగేళ్ల పాటు చదివిన విద్యార్థులకు 60 శాతం సీట్లు రిజర్వ్‌ చేయబడ్డాయి. ఈసారి పట్టణ ప్రాంతాల అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 15–22 ఏళ్ల మధ్య జన్మించిన వారు అర్హులు. పాలిసెట్‌–2025 (అగ్రికల్చర్‌ విభాగం)లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా సీట్లను కౌన్సిలింగ్‌ పద్ధతిలో కేటాయిస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు..

ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ శనివారం నుంచి ప్రారంభమైంది. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ విద్యార్థులు రూ.600, ఇతర అభ్యర్థులు రూ.1,200 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు ఫేమెంట్‌ రిజిస్ట్రేషన్‌కు ఈనెల 28, ఆన్‌లైన్‌ దరఖాస్తులు సమర్పించేందుకు 29 చివరి తేదీ. ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు వస్తే మొదటి సెమిస్టర్‌కు రూ.19,645, ప్రైవేట్‌ కాలేజీల్లో వస్తే రూ.24 వేల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ వర్శిటీ వెబ్‌సైట్‌ పీజేటీయూ.ఈడీయూ.ఇన్‌లో సంప్రదించవచ్చు.

పాలిసెట్‌–2025 (అగ్రికల్చర్‌) ర్యాంకుల ద్వారా సీట్ల భర్తీ

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ ఈనెల 29

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement