
ప్లాస్టిక్ సామగ్రి నిల్వ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం
జగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామంలోని వాగు సమీపంలో పనికిరాని ప్లాస్టిక్ సామగ్రి నిల్వ చేసే దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించి సుమారు రూ.70 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. వివరాలు.. ధరూర్లోని కొలగాని సత్యనారాయణరావుకు చెందిన రేకులషెడ్డులో ముంబయ్కి చెందిన సల్మాన్ పనికిరాని ప్లాస్టిక్, పాత ఇనుప సామగ్రి సేకరించి, దానిని మిషనరిల ద్వారా స్క్రాప్ చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తాడు. శనివారం ప్లాస్టిక్ సామగ్రి సేకరించే సమయంలో దుకాణం పక్కనే ఓ వ్యక్తి దహన సంస్కారాలు నిర్వహించగా అక్కడి నుంచి నిప్పులు అకస్మాత్తుగా వచ్చి ప్లాస్టిక్ సామగ్రి ఉన్న చోట పడడంతో మంటలు భారీగా వ్యాపించాయి. అప్రమత్తమైన రెవెన్యూ, అగ్నిమాపక శాఖలు అక్కడకు చేరుకుని జగిత్యాల, ధర్మపురి, చొప్పదండి, మెట్పల్లి నుంచి ఫైరింజన్లను రప్పించారు. సుమారు 6 గంటల పాటు శ్రమించి మంటలు ఆర్పివేశారు. కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్కుమార్ ఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రక్రియను పర్యవేక్షించారు. ఈప్రమాదంలో రూ.30 లక్షల రేకులషెడ్డుతో పాటు రూ.40 లక్షల విలువ గల సామగ్రి, మిషన్లు కాలిపోయాయి. మంటలు ఆర్పేయడంలో జగిత్యాల అగ్నిమాపక శాఖ అధికారి కృష్ణకాంత్, సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించారు. సిబ్బంది మధు కాలుకు స్వల్పగాయాలు కాగా, జగిత్యాలలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు మున్సిపల్ కమిషనర్ స్పందన, తహసీల్దార్ శ్రీనివాస్ ఘటన స్థలంలో ఉండి పర్యవేక్షించారు. కాగా, ఈ ప్రమాదంతో మొదట దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు. ఏం జరుగుతుందో తెలియక పరుగులు తీశారు. మంటలు అదుపులోకి రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.
నాలుగు ఫైరింజన్లతో మంటలు ఆర్పివేత