
పాటల రూపంలో వృత్తి ధర్మాన్ని ఆచరిస్తూ..
రామగుండం: విద్యార్థులను ఆకట్టుకునే రీతిలో వివిధ అంశాలపై పాటల రూపంలో రీల్స్ తీసి పేరెంట్స్, విద్యార్థుల గుండెల్లో స్థానం పదిల పర్చుకున్నారు రామగుండం జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం అజ్మీరా శారద. బడిబాట కార్యక్రమాన్ని ఉద్దేశించి పాట రాసి రీల్స్ షూట్ చేయడం నెట్టింటా వైరల్గా మారింది. దీనిని వందేమాతరం ఫౌండేషన్ గుర్తించి బహుమతి ప్రకటించారు. నైతిక విలువలతో కూడిన బోధన, విద్య గొప్పదనం ప్రతిబింబించేలా పాట రాసి ఆలపించడం ఆకట్టుకుంది. ‘బడి బయట ఏముందిరా చిన్నా.. బడిలోనే ఆటుందిరా చిన్నా’.. అంటూ చేసిన రీల్స్ ప్రతీ ఒక్కరిని ఆలోచింపజేశాయి. ఇలా సందర్భాన్ని బట్టి ఇప్పటి వరకు 15 పాటలు రాసినట్లు హెచ్ఎం తెలిపారు.
ప్రత్యేక వాహనంతో..
మానకొండూర్: బడిబాటలో ఎంఈవో మధుసూదనాచారి ప్రత్యేక వాహనం, మైక్ సెట్ ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తూ వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈనెల 5 నుంచి ప్రచార రథంతో ఆయా గ్రామాల్లో తిరుగుతూ పాటల ద్వారా బడిబాట ఉద్దేశాన్ని వివరిస్తున్నారు. ఉపాధ్యాయులు ప్రచార రథం వెంట, ఇంటింటా ప్రచారం నిర్వహించి పిల్లలు ప్రభుత్వ బడిలో చేరేలా కృషి చేస్తున్నారు.

పాటల రూపంలో వృత్తి ధర్మాన్ని ఆచరిస్తూ..