
విత్తన లెక్క.. ఇక పక్కా
● విత్తన శుద్ధి కేంద్రాలపై ధ్రువీకరణ సంస్థకు పర్యవేక్షణ బాధ్యత
● రిజిస్ట్రేషన్ను తప్పనిసరి చేసిన ప్రభుత్వం
కరీంనగర్ అర్బన్: ఆరుగాలం కష్టపడే అన్నదాతకు నకిలీ విత్తనాల బెడద తప్పనుంది. అక్రమంగా విత్తనాలు తయారుచేసి విక్రయించేవారిపై ప్రభుత్వం ఇక ఉక్కుపాదం మోపనుంది. వరి, పత్తి, కంది, పెసలు, కూరగాయలు ఇతర పంటలకు విత్తన కంపనీలపై ఆధారపడటం జరిగే ప్రక్రియ. దీన్ని ఆసరా చేసుకున్న వ్యాపారులు అక్రమార్గంలో లక్షలు గడించాలనే దురాశతో ఏటా నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. తీరా సస్యరక్షణ చర్యలు చేపట్టాకా కాత దశకు వచ్చే క్రమంలో నకిలీదని తేలడంతో ఆర్థికంగా జరగాల్సిన నష్టం జరుగుతుండగా అండగా నిలవాల్సిన యంత్రాంగం పట్టించుకోవడంలేదు. ఈ నేపథ్యంలో విత్తనాల విక్రయాలు పక్కాగా జరిగితేనే అన్నదాతలకు అభయం ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం విత్తన శుద్ధి కేంద్రాలపై పర్యవేక్షణను కట్టుదిట్టం చేసింది.
నిబంధనల మేరకు వ్యవహరించాల్సిందే
నకిలీలకు చెక్ పెట్టాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం కొత్త విత్తన చట్టం అమలు కోసం ఇప్పటికే కసరత్తు చేస్తుండగా విత్తనశుద్ధి మిల్లులు ఎన్నో లెక్క తేల్చడం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో వ్యవసాయ శాఖకు ఉత్తర్వులు జారీచేసింది. విత్తనశుద్ధి మిల్లులు నిర్వహిస్తున్న యజమానులు ఇక నుంచి తప్పనిసరిగా ప్రభుత్వ వ్యవసాయశాఖ వద్ద విత్తన ధ్రువీకరణ సంస్థ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న మిల్లులకు మాత్రమే రైతుల నుంచి విత్తనాలు సేకరించి, వాటిని విత్తనశుద్ధి చేశాక తిరిగి విత్తన కంపనీలకు అందించే హక్కు ఉంటుంది. ఇలా చేయకుండా ఎలాంటి అనుమతుల్లేకుండా విత్తనశుద్ధి కోసం మిల్లులు నిర్వహిస్తే కొత్త విత్తన చట్టం ప్రకారం వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు విత్తనశుద్ధి మిల్లులను సీజ్చేసే అధికారం కూడా ప్రభుత్వం విత్తన ధ్రువీకరణ సంస్థకు కట్టబెట్టింది.
50కి పైగా విత్తన శుద్ధి కేంద్రాలు
ఉమ్మడి జిల్లాలో విత్తన పత్తితో పాటు వరి, కందులు, పెసలు, వేరుశెనగ, కూరగాయల విత్తనాలు తిరుగు ఒప్పందం ద్వారా రైతులతో సాగు చేయించి వారి నుంచి వాటిని తిరిగి కొనుగోలు చేసి విత్తనాలను శుద్ధిచేసి మధ్యవర్తులుగా ఉండి కంపెనీల విత్తన అవసరాలు తీర్చే విత్తన శుద్ధి మిల్లులు 50కి పైగా ఉన్నాయి. ఉన్న మిల్లులు మొత్తం చాలావరకు విత్తన అవగాహన ఒప్పందం ప్రకారం నెలకొల్పినవి మాత్రమే. వీటికి ఒక రిజిస్ట్రేషన్ నంబర్ కానీ ఇప్పటివరకు లేదు. కొన్ని విత్తనశుద్ధి మిల్లులకు కనీసం స్థానికంగా ఉండే అధికారుల అనుమతి కూడా లేని దుస్థితి. ఉమ్మడి జిల్లాలో వరి, పత్తిని రైతులు విరివిగా సాగుచేస్తున్న కారణంగా ఆరేళ్లకాలంలో 20కి పైగా విత్తనశుద్ధి మిల్లులు వెలిశాయి. అన్ని విత్తన అవగాహన ఒప్పందం ప్రకారం వెలిసినవే. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా వీటి లెక్క ఇక నుంచి పక్కా కానుంది. కంపెనీలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయడంతో పాటు ప్రభుత్వ కోడ్ కూడా ఉంటుంది. అదే కోడ్తో విత్తనశుద్ధి మిల్లుల నుంచి కంపెనీలకు కానీ రైతులకు కానీ.. విత్తనాలు చేరవేయాల్సి ఉంటుంది. గతంలో విత్తనశుద్ధి మిల్లులపై విత్తన ధ్రువీకరణ సంస్థకు కానీ వ్యవసాయ శాఖకు కానీ పెద్దగా పర్యవేక్షణ అధికారాలు లేకపోవడంతో మిల్లులో నకిలీ విత్తనాలు శుద్ధి చేస్తున్నారా? నాణ్యత గల విత్తనాలు శుద్ధి చేస్తున్నారా? అన్నది తెలియని పరిస్థితి. ఇక నుంచి వాటిని పర్యవేక్షించే అధికారాలు విత్తన ఽధ్రువీకరణ సంస్థ అధికారులకు కట్టబెట్టడంతో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించే వ్యవస్థ కొంత మెరగయ్యే అవకాశముంది.
రూ.వెయ్యి కోట్ల విత్తన వ్యాపారం
ఉమ్మడి జిల్లాలో రైతులకు తిరుగు ఒప్పందం ద్వారా ఫౌండేషన్ విత్తనాలు ఇచ్చి వాటిని తిరిగి కొనుగోలు చేసి విత్తనశుద్ధి మిల్లుల ద్వారా శుద్ధి చేసి కంపెనీలకు అందిస్తే వారు తమ సొంత విత్తన ఽధ్రువీకరణ ట్యాగ్పై సర్టిఫైడ్ విత్తనాలుగా రైతులకు అమ్ముతున్నారు. ఏటా ఉమ్మడి జిల్లాలో విత్తనశుద్ధి మిల్లుల ద్వారా రైతుల నుంచి కొనుగోలు, అమ్మకాల వ్యాపారం ఏటా రూ.800కోట్ల వరకు నడుస్తోంది. ఇంత వ్యాపారం జరుగుతున్నా విత్తన కంపెనీలు వ్యవసాయ చట్టాల్లో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులకు మొత్తం ఎగనామం పెడుతున్నారు. ఒక్క కరీంనగర్ జిల్లాలో ఏటా రూ.500 కోట్ల వరకు విత్తన వ్యాపారం జరుగుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అసలు ఉత్పత్తి అయిన చోట నుంచి అమ్మకం జరిగే దాకా లెక్కలను విత్తనశుద్ధి మిల్లుల నిర్వాహకులు, విత్తన కంపెనీలు ప్రభుత్వానికి పక్కాగా చెప్పాల్సి ఉంటుంది.