
లారీలు ఢీ.. ఒకరు మృతి
హుజూరాబాద్: ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారుతున్న తుమ్మన్నపల్లి గ్రామం మీదుగా వెళ్తున్న వరంగల్–కరీంనగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరగగా.. ఒకరు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా టంగుటూరు గ్రామానికి చెందిన దాచేపల్లి కృష్ణకిషోర్(44) లారీని ఎదురుగా వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. కృష్ణకిశోర్ లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అతి కష్టమ్మీద క్షతగాత్రుడికి బయటికి తీసి చికిత్స నిమిత్తం హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించే లోపే మృతిచెందాడు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. లారీ క్లీనర్ మస్తాన్, మరో డ్రైవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు లారీలు బ్రిడ్జిపై ఢీకొనగా.. అటు వరంగల్, ఇటు కరీంనగర్ వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు వాహనాలను దారి మళ్లించి ట్రాఫిక్ పునరుద్ధరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద స్థలాన్ని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను సీఐ కరుణాకర్నడిగి తెలుసుకున్నారు.