పంచాయతీ కార్యదర్శులపై పారిశుధ్య భారం | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ కార్యదర్శులపై పారిశుధ్య భారం

Jun 6 2025 1:10 AM | Updated on Jun 6 2025 1:10 AM

పంచాయతీ కార్యదర్శులపై పారిశుధ్య భారం

పంచాయతీ కార్యదర్శులపై పారిశుధ్య భారం

● కొత్త డీఎస్‌ఆర్‌ యాప్‌పై నిరసన ● నమోదు కాని హాజరు

కరీంనగర్‌రూరల్‌: పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది. ఓవైపు పంచాయతీ పాలకవర్గాలు లేక మరోవైపు నిధులు విడుదలకాక అప్పులు చేసి కార్యదర్శులు పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఇటీవల పారిశుధ్య నిర్వహణపై జారీచేసిన గైడ్‌లైన్స్‌ భారంగా మారాయంటూ కార్యదర్శులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతనెల 24 నుంచి ప్రభుత్వం పారిశుధ్య నిర్వహణ కోసం డైలీ శానిటేషన్‌ రిపోర్టు యాప్‌ అమలు చేస్తోంది. దీని ప్రకారం పంచాయతీ కార్యదర్శులు రోజూ పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఫొటోలు, వివరాలను యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అయితే కొత్త విధానంతో తమపై అదనపు పనిభారం పడుతుందంటూ పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు కార్యదర్శులు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టారు. జిల్లాలో మొత్తం 318 గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తుండగా కరీంనగర్‌ మండలంలో 14మంది కార్యదర్శులున్నారు.

డీఎస్‌ఆర్‌ యాప్‌లో ఏముంది.?

ప్రభుత్వం పారిశుధ్య నిర్వహణ కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన డైలీ శానిటేషన్‌ రిపోర్టు యాప్‌ పంచాయతీ కార్యదర్శులకు గుదిబండగా మారింది. పంచాయతీ పరిధిలో ఎన్ని నివాస గృహాలు ఉన్నాయి, రోజు ఎన్ని గృహాలనుంచి చెత్తను సేకరిస్తున్నారో యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. తడి చెత్త, పొడి చెత్త ఎన్ని కిలోల చొప్పున సేకరించారు, మొత్తం ఎన్ని ఇళ్లనుంచి నుంచి రోజులో ఎంత పరిమాణంలో సేకరించారో పూర్తి వివరాలు నమోదు చేయాలి. డంపింగ్‌యార్డు, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, నర్సరీల వద్ద అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణతోపాటు చెత్త సేకరణ బాధ్యతను అప్పగించడంతో రోజువారీ పనులు పడకేస్తాయని పంచాయతీ కార్యదర్శులు పేర్కొంటున్నారు. మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్‌ సమస్యతో యాప్‌లో వివరాలు నమోదు చేయడంలో జాప్యం కలుగుతుందని తెలుపుతున్నారు. ఇప్పటికే ఓటరు జాబితా సర్వే, రేషన్‌కార్డుల విచారణ, ఇందిరమ్మ ఇళ్లు, మిషన్‌ భగీరథ, స్వచ్ఛభారత్‌ మిషన్‌ కార్యక్రమాల కారణంగా సుమారు 10 యాప్‌లలో వివరాలను అప్‌లోడ్‌ చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కొత్త డీఎస్‌ఆర్‌ యాప్‌తో అదనపు పనిభారం పడుతుందనే కారణంతో యాప్‌లో వివరాలను నమోదు చేయడం లేదని పలువురు కార్యదర్శులు తెలిపారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కార్యదర్శులు కొత్త యాప్‌లో వివరాలను నమోదు చేయాలని పంచాయతీ అధికారులు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement