
లారీడ్రైవర్ నిర్లక్ష్యం.. యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ మ
ఐనవోలు(వరంగల్): మసకచీకటిలో.. నడిరోడ్డుపై ఇండికేటర్స్ వేయకుండా ఆగిఉన్న లారీని.. వెనుకనుంచి కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలోని వరంగల్–ఖమ్మం రహదారి పంథిని గ్రామంలోని హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు, ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మంనుంచి వరంగల్ వైపు సిమెంట్ బస్తాలతో వెళ్తున్న లారీని పంథిని గ్రామంలోని హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద నడిరోడ్డుపై ఆపిన డ్రైవర్ ఇండికేటర్స్ వేయకుండానే లారీ దిగి వెళ్లాడు. అదే సమయంలో పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం గోదావరిఖనికి చెందిన యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ చింతకింది శివసాయి(29) తన పనుల నిమిత్తం సొంత కారులో ఖమ్మంనుంచి వరంగల్ వైపునకు వెళ్తున్నాడు. ఈక్రమంలో పంథిని పెట్రోల్ బంక్ వద్ద ఎదురుగా వస్తున్న వాహనాల లైట్ ఫోకస్కు దారి కనిపించకపోవడంతో ఇండికేటర్స్ వేయకుండా రోడ్డుపై నిలిపి ఉన్న లారీని ఢీకొట్టాడు. దీంతో శివసాయి తల, శరీర భాగాలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్లోని ఎంజీఎంకు తరలించారు. మృతుడికి ఇద్దరు అక్కలు, అమ్మ, నాన్న ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.
ఇండికేటర్లు వేయకుండానే నడిరోడ్డుపై నిలిపిన లారీ
వెనుకనుంచి ఢీకొట్టిన కారు..
మృతుడిది పెద్దపల్లి జిల్లా గోదావరిఖని