ఈ పాపం ఎవరిది? | - | Sakshi
Sakshi News home page

ఈ పాపం ఎవరిది?

Jun 4 2025 12:05 AM | Updated on Jun 4 2025 12:05 AM

ఈ పాప

ఈ పాపం ఎవరిది?

● కొత్తపల్లిలో 476 పట్టాలు రద్దు ● ల్యాండ్‌ సీలింగ్‌ యాక్ట్‌ లో 20 ఎకరాల భూమి సర్కారు పరం ● 1995 నుంచి పలువురి చేతులు మారిన భూములు ● లోకాయుక్త ఆదేశాలతో 476లో 454 పట్టాలు రద్దు ● రద్దు కానున్న మిగిలిన 22 పట్టాలు ● రెవెన్యూ, స్టాంప్స్‌..రిజిస్ట్రేషన్స్‌ శాఖలమధ్య సమన్వయ లోపం ● న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించిన బాధితులు

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌:

కొత్తపల్లిలోని వివాదాస్పద 20 ఎకరాల భూమి తిరిగి ప్రభుత్వ వశమైంది. ప్రభుత్వం 476 పట్టాలు రద్దుచేసి మరీ భూమిని స్వాధీనం చేసుకోనుంది. మంగళవారం వరకు 454 పట్టాలను రద్దు చేసిన అధికారులు మరో 22 పట్టాలను కూడా అర్ధరాత్రి వరకు పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. 476 మందిలో అంతా సామాన్యులు కావడం.. పైసాపైసా కూడబెట్టుకున్న సొమ్ము కావడంతో వారంతా ఇప్పుడు రోడ్డున పడ్డారు. సర్వే నెంబరు 175, 197, 198లలోని 20 ఎకరాల భూమిలో ప్లాట్లు కొన్న వారంతా ఇపుడు లబోదిబోమంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.వందల కోట్ల సొమ్ము వెచ్చించిన భూమికి అర్థం లేకుండా పోవడంతో కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. రెవెన్యూ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలమధ్య సమన్వయలోపానికి సామాన్యులు మూల్యం చెల్లించే దుస్థితి రావడం దురదృష్టకరం. దీంతో ఒక్కతాటిపైకి వచ్చిన బాఽధితులు హైకోర్టు గడప తొక్కారు. వారి కేసును స్వీకరించిన న్యాయస్థానం పిటిషన్‌ను స్వీకరించడంతో బాధితుల్లో ఆశలు చిగురించాయి.

సమన్వయలోపమే శాపం..

కొత్తపల్లి రెవెన్యూ పరిధిలో 175, 197, 198 సర్వే నెంబర్లలో దాదాపు 20 ఎకరాల భూమిని ల్యాండ్‌ సీలింగ్‌ యాక్ట్‌ కింద ప్రభుత్వం గతంలో స్వాధీనం చేసుకుంది. 1995 సంవత్సరంలో వివాదం మొదలైనా.. ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు లోక్‌సత్తా శ్రీనివాస్‌ లోకాయుక్తను ఆశ్రయించడంతో వివాదం బాగా ప్రాచుర్యం పొందింది. గతేడాది నవంబరులో లోకాయుక్త మూడు సర్వే నెంబర్లలోని ఇప్పటి వరకు జరిగిన రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించింది. దీంతో ఆర్డీవో మహేశ్వర్‌ గతవారం నుంచి వివాదాస్పద సర్వే నెంబర్లు 175, 197, 198లో నమోదైన పట్టాలను రద్దు చేసుకుంటూ వచ్చారు. తాజాగా ఈ 476 పట్టాలు రద్దు కావడంతో బాధితులు అంతా ఒక్క తాటిపైకి వచ్చారు. 1995 నుంచి వివాదం ఉన్నప్పుడు వీటిని బ్లాక్‌ లిస్టులు పెట్టని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖలపై మండిపడుతున్నారు. ప్రభుత్వ విభాగాలు చేసిన తప్పుకు తామెందుకు బలవ్వాలని ప్రశ్నిస్తున్నారు. జీవితాంతం దాచుకున్న డబ్బుతో కొన్న ఇంటిజాగాలపై హక్కులేదనడంతో గుండెలు ఆగినంత పనవుతుందని వాపోతున్నారు. న్యాయస్థానంలో తమకు న్యాయం జరుగుతుందని ధీమాగా ఉన్నారు.

న్యాయం కోసం హైకోర్టుకు..

కొత్తపల్లి పట్టణ పరిధిలోని 197, 198 సర్వేనెంబర్లలో గల భూమికి సంబంధించిన అన్ని ఆధారాలు కలెక్టర్‌కు చూపించాం. న్యాయం చేయాలని విన్నవించినప్పటికీ విన్నపాన్ని పరిగణలోకి తీసుకోకుండా 476 డాక్యుమెంట్లు రద్దు చేశారు. ఇక్కడ న్యాయం జరగకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాం. సరైన న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం.

– మ్యాక రాజగోపాల్‌రెడ్డి, బాధితుడు

ఈ పాపం ఎవరిది?1
1/1

ఈ పాపం ఎవరిది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement