
మహిళా వ్యవసాయ కళాశాల తరలింపు..?
జగిత్యాల: జగిత్యాల జిల్లా కోరుట్లలో కొనసాగుతున్న సాంఘిక సంక్షేమ గురుకులం మహిళా వ్యవసాయ డిగ్రీ కళాశాలను మానకొండూర్ నియోజకవర్గంలోని బెజ్జంకికి తరలిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాకు ఈ కళాశాల మంజూరు కాగా.. అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచనల మేరకు కోరుట్లలోని ఓ ప్రభుత్వ భవనంలో ప్రారంభించారు. అప్పటినుంచి అదే భవనంలో కొనసాగుతోంది. కళాశాలకు శాశ్వత భవనం కోసం అప్పటి మంత్రి సూచనల మేరకు వెల్గటూర్ మండలం స్తంభంపల్లిలో దాదాపు 50 ఎకరాల భూమి కేటాయించారు. అప్పటికే స్తంభంపల్లిలో ఏర్పాటు చేయదలిచిన ఇథనాల్ ఫ్యాక్టరీకి స్థలం కేటాయించగా.. ఆ ఫ్యాక్టరీ రద్దు కావడంతో సదరు స్థలాన్ని ఈ కళాశాలకు కేటాయించాలని అధికారులు నిర్ణయించారు. అయితే కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడింది. మరోవైపు ఇటీవలే వ్యవసాయ కళాశాలకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీగాను గుర్తింపు వచ్చింది. దీంతో అందులో చదువుతున్న విద్యార్థులకు ఎంతో వెసులుబాటు కలిగింది. మొదట 2023–24 విద్యా సంవత్సరంలో ఈ కళాశాలను సిద్దిపేటలో నాలుగేళ్ల బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాలగా కొనసాగించారు. అక్కడ మరో కళాశాల మంజూరు కావడంతో దానిని సాంఘిక సంక్షేమ కళాశాలగా మార్చుతూ జగిత్యాలకు తరలించారు. జిల్లాకేంద్రంలో భవనం అందుబాటులో లేకపోవడంతో అప్పటి మంత్రి ఈశ్వర్ సూచనల మేరకు కోరుట్లలో ఏర్పాటు చేశారు. ఆ సమయంలో అగ్రికల్చర్ కోర్సుకు సంబంధించి వర్సిటి గుర్తింపు రాలేదు. ఫలితంగా కోర్సులో చేరిన విద్యార్థులు సందిగ్ధంలో పడిపోయారు. మొదటి సంవత్సరం పూర్తయిన విద్యార్థులు ఏ వర్సిటీ అటనామస్ కింద పరీక్షలు రాయాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ విషయం ఇటీవల ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో దానికి జయశంకర్ యూనివర్సిటీ గుర్తింపు ఇచ్చారు. దీంతో విద్యార్థులకు సమస్య లేకుండా పోయింది. ఇలాంటి తరుణంలో కళాశాలను బెజ్జంకికి తరలిస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కళాశాలకు బెజ్జంకిలో 75ఎకరాలు కేటాయించేందుకు అధికారుల బృందం పర్యటిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ విషయమై సంబంధిత ప్రిన్సిపాల్ను వివరణ కోరగా.. తమకు గైడ్లైన్స్ రాలేదని పేర్కొన్నారు.
కోరుట్ల నుంచి బెజ్జంకికి తరలిస్తున్నట్లు సమాచారం