
నిలువ చేస్తే నిరాశే మిగిలింది
మోర్తాడ్(బాల్కొండ): నిలువ చేసిన పంటను సీజన్ ముగిసిన తర్వాత విక్రయించుకుందామనుకున్న ఎర్రజొన్న రైతులకు నిరాశే మిగిలింది. గత సీజన్లో ఎర్రజొన్న క్వింటాల్కు రూ.3,800 ధర లభించడంతో మోర్తాడ్కు చెందిన మహిపాల్ అనే రైతు 40 క్వింటాళ్ల ఎర్రజొన్నలను నిలువ చేసుకున్నాడు. సీజన్ ముగిసిన తర్వాత కనీసం రూ.4,200 ధర లభిస్తుందని ఆశించాడు. కానీ, విత్తన వ్యాపారుల సిండికేట్తో సీజన్ ముగిసినా ధర ఏమాత్రం పెరగకపోగా కనీసం సీజన్లో లభించిన ధర కూడా దక్కలేదు. దీంతో వారం కింద క్వింటాల్కు రూ.400 తక్కువకు పంటను విక్రయించాడు. సుమారు రూ.16 వేల నష్టానికే మహిపాల్ తన పంటను విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహిపాల్ మాదిరిగానే ఎర్రజొన్నలను నిలువ చేసుకున్న రైతులందరూ తక్కువ ధరకే తమ పంటను విక్రయించారు. రైతుల వద్ద దాదాపు 5వేల క్వింటాళ్ల ఎర్రజొన్నలు నిలువ ఉండగా ఒక్కో క్వింటాలుకు రూ.3,400 ధర ప్రకారం విక్రయించడంతో రూ.20 లక్షల వరకు లాభాన్ని కోల్పోయారు. గతంలో క్వింటాలుకు రూ.4,500 వరకు పలకగా, సీడ్ వ్యాపారుల గుత్తాధిపత్యంతో ధర పడిపోయి రైతులకు తీరని నష్టం మిగిల్చింది.
ఆరబోసిన ఎర్రజొన్నలు(ఫైల్)
తగ్గిన ఎర్రజొన్నల ధర
ఆవేదనలో అన్నదాత