
మన్యం వీరునికి ఘన నివాళులు
కాకినాడ సిటీ: స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు చూపిన ధైర్య సాహసాలు వెలకట్టలేనివని, ఆయన అందించిన స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తుందని కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. శుక్రవారం అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా జిల్లా గిరిజన సంక్షేమం, సీతారామరాజు స్మారక కళావేదిక ఆధ్వర్యంలో కాకినాడ నాగమల్లితోట జంక్షన్ వద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహానికి కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా,ఎంపీ సానా సతీష్బాబు, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖరం ఇతర జిల్లా అధికారులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన ప్రాంత ప్రజలలో స్వాతంత్య్ర కాంక్షను రగిలించడంలో అల్లూరి కీలక పాత్ర పోషించారన్నారు. గిరిజన ప్రజలకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి ఆయన ధైర్య సాహసాలు స్ఫూర్తిగా నిలుస్తాయని కలెక్టర్ తెలిపారు. డీటీడబ్ల్యూవో ఎన్ నాగమల్లేశ్వరరావు, సెట్రాజ్ సీఈవో మల్లికార్జునరావు పాల్గొన్నారు.
6న స్విమ్మింగ్
క్రీడాకారుల ఎంపికలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): జిల్లా స్విమ్మింగ్ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 6న స్విమ్మింగ్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు సంఘ కార్యదర్శి ఐ.రాజు శుక్రవారం తెలిపారు. స్థానిక జిల్లా క్రీడామైదానంలోని స్విమ్మింగ్ పూల్లో ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. సబ్ జూనియర్స్, జూనియర్స్ విభాగంలో బాలురు, బాలికల ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 19, 20 తేదీలలో విశాఖలో జరిగే అంతర్ జిల్లా స్విమ్మింగ్ పోటీలలో పాల్గొంటారని తెలిపారు.
ప‘రేషాన్’
సామర్లకోట: రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభం కావడంతో లబ్ధిదారుల కష్టాలు మొదలయ్యాయి. స్థానిక 13వ వార్డులోని ప్రజలకు ఒక కిలోమీటరు దూరంలో ఉన్న రేషన్ షాపు నుంచి సరకులు తెచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై శుక్రవారం 13వ వార్డు బలుసులపేటకు చెందిన వృద్ధురాలు ముసలమ్మ నెత్తిపై బియ్యం మూట పెట్టుకొని మోయలేక అవస్థ పడింది. ముసలమ్మ మాట్లాడుతూ గతంలో ఇంటి వద్దకే వాహనం రావడంతో శ్రమ ఉండేది కాదని చెప్పింది. చంద్రబాబు వచ్చి కష్టాలు తెచ్చాడని ఆవేదన వ్యక్తం చేసింది.
తల్లికి వందనం కోసం
పోస్టల్ ఖాతాలు తెరవాలి
కాకినాడ సిటీ: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు తల్లికి వందనం డబ్బు జమ చేసేందుకు వీలుగా పోస్టాఫీసులో రూ.200తో కొత్త ఖాతాను తెరిచి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పోర్టల్లో ఆధార్ అనుసంధానం చేసుకోవాలని సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకులు ఎంఎస్ శోభారాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు పోస్టల్ డిపార్టుమెంట్ ద్వారా మేళా నిర్వహిస్తారన్నారు. మేళా తేదీ ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్ ద్వారా తెలియజేస్తామన్నారు. మేళాకు విద్యార్థులందరూ ఆధార్కార్డుతో పాటు ఆధార్కు అనుసంధానం చేయబడిన ఫోన్ను కూడా తీసుకు వెళ్లాలని వివరించారు.

మన్యం వీరునికి ఘన నివాళులు