
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
● చెట్టుకు ఢీకొని నుజ్జయిన కారు
● పోతవరంలో విషాద ఛాయలు
నల్లజర్ల: మండలంలోని పోతవరం–యర్నగూడెం రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే పోతవరం సర్పంచ్ నూతికుర్తి లక్ష్మణరావు సోదరుడు రామకృష్ణ తన భార్య రత్నకుమారి, కుమారుడు మనోజ్ (24), మనుమరాలు ఆద్య (2) నిడదవోలులోని కలవచర్ల గ్రామానికి ఓ వివాహానికి హాజరయ్యేందుకు కారులో బయలుదేరారు. పోతవరం నుంచి బయలుదేరి కిలోమీటరు దూరం వెళ్లేసరికే అతివేగంతో చెట్టును ఢీకొని కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మనోజ్ అక్కడికక్కడే మృతి చెందగా రామకృష్ణ, రత్నకుమారి, ఆద్య తీవ్ర గాయాలపాలయ్యారు. పోతవరంలో జరుగుతున్న జాతర హడావిడిలో ఉన్న గ్రామస్తులు ఈ ప్రమాద వార్త తెలియగానే హుటాహుటిన ఘటనాస్థలానికి వెళ్లి క్షతగాత్రులను ఏలూరు ఆశ్రమ్ ఆస్పత్రికి తరలించారు. రామకృష్ణ మనవరాలు (కుమార్తె అంకితకు కుమార్తె) ఆద్య చికిత్స పొందుతూ మృతి చెందగా మిగిలిన ఇద్దరూ చికిత్స పొందుతున్నారు. పోతవరంలో జరుగుతున్న జాతర చూసేందుకు హైదరాబాద్ నుంచి వచ్చిన మనోజ్ ఇలా మృతి చెందడంతో పోతవరంలో విషాదఛాయలు అలముకున్నాయి. క్షతగాత్రలను మాజీ హోం మంత్రి తానేటి వనిత, మండల పార్టీ అధ్యక్షుడు వెల్లంకి వెంకట సుబ్రమణ్యం, మాజీ జెడ్పీటీసీ బంక అప్పారావు పరామర్శించారు. అనంతరం పోతవరం వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించి బంధువులను పరామర్శించారు. కాగా ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు కాలేదు.
తమ్ముడి పిల్లలే తన పిల్లలుగా..
పోతవరం సర్పంచ్ నూతికుర్తి లక్ష్మణరావుకు పిల్లలు లేకపోవడంతో తన సోదరుడు రామకృష్ణ పిల్లలనే తన పిల్లలుగా అల్లారుముద్దుగా పెంచారు. అవసాన దశలో తమ అన్నదమ్ములిద్దరికి ఆసరాగా ఉంటాడుకున్న మనోజ్ జీవితం ఇలా ముగియడంతో ఆ దంపతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇంజినీరింగ్ పూర్తిచేసిన మనోజ్ కారు కావాలంటే కొన్నామని, ఏ లోటూ రాకుండా చూసుకున్నామని వారు అతనితో జ్ఞాపకాలను గుర్తుచేసుకుని రోదిస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి