
అమాత్యులొస్తున్నారు.. మళ్లీ మొదలు పెట్టండి!
‘అయ్యగారొస్తున్నారు మళ్లీ మొదలెట్టండి’ అన్నట్లుగా ఉంది పిఠాపురంలో కూటమి నేతల తీరు. స్థానిక పాదగయ క్షేత్రంలో భక్తులకు స్వచ్ఛమైన మంచినీటిని అందించేందుకు దివీస్ సంస్థ గతంలో రెండు ఆర్ఓ ప్లాంట్లు నిర్మించింది. నెల రోజుల క్రితమే ప్రత్యేక పూజలు నిర్వహించి మరీ జిల్లా దేవదాయ, ధర్మాదాయ శాఖ అధికారి ఈవీ సుబ్బారావు, స్థానిక ఈఓ కాట్నం జగన్మోహన శ్రీనివాస్, దివీస్ సిబ్బంది వీటిని ప్రారంభించారు. ప్రస్తుతం, వీటి వద్ద భక్తులు మంచినీరు తాగుతున్నారు. ఇప్పుడు ఇదే ఆర్ఓ ప్లాంటును రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ఆదివారం మళ్లీ ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనసేన నేతల ఆదేశాలకు తలొగ్గే అధికారులు ఇలా చేస్తున్నారని, లేకపోతే ఎప్పుడో ప్రారంభించిన వాటర్ ప్లాంటును మళ్లీ ఇప్పుడు మంత్రి చేతుల మీదుగా ప్రారంభించడమేమిటని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
– పిఠాపురం

అమాత్యులొస్తున్నారు.. మళ్లీ మొదలు పెట్టండి!