
ఏయూ డిగ్రీ ఫలితాల్లో ‘ఆదిత్య’ ప్రతిభ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఆంధ్రా యూనివర్సిటీ విడుదల చేసిన డిగ్రీ ఫలితాల్లో తమ విద్యార్థులు 1, 2, 3 ర్యాంకులతో పాటు, నూరు శాతం ఉత్తీర్ణత సాధించారని ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ ఎన్.శేషారెడ్డి సోమవారం తెలిపారు. బీసీఏ విభాగంలో దున్నా ధనలక్ష్మి మొదటి ర్యాంక్, ఎ.పావని ఏ.క్యాతిశ్రీ రెండో ర్యాంక్, బి.శిరీష మూడో ర్యాంక్, జి.రిపిక మూడో ర్యాంక్ సాధించారన్నారు. బీబీఏ నుంచి కె.మహిత రెండో ర్యాంక్, వి.మౌనిక మూడో ర్యాంక్, జి.వెంకటసాయికీర్తి మూడో ర్యాంక్, బీఎస్సీలో ఎం.యమున ఫస్ట్ ర్యాంక్, సత్తి మోనిక విషాల్ మూడో ర్యాంక్, బీకామ్ నుంచి పి.హరిప్రియ రెండో ర్యాంక్, పి.పల్లవి మూడో ర్యాంక్ సాధించారని చెప్పారు. యూనివర్సిటీ తరఫున ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఏయూ రిజిస్ట్రార్ ఈఎన్ ధనుంజయరావు అభినందనలు తెలిపారు. ఆదిత్య కళాశాల ఉన్నత విద్యా ప్రమాణాలు, అధ్యాపకుల కార్యదక్షతను కొనియాడారు. విద్యాసంస్థల కార్యదర్శి ఎన్.సుగుణారెడ్డి విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. 2024–25లో ఇప్పటి వరకూ జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో 15,120 మంది విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు.
యువతి ఆత్మహత్య
ఉప్పలగుప్తం: పెళ్లి చేసుకుంటానని నమ్మించిన వ్యక్తి మోసం చేయడంతో మనస్తాపానికి గురైన యువతి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఇది. మండలంలోని ఎస్.యానం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై సీహెచ్ రాజేష్ వివరాల మేరకు, ఎస్.యానం పెదపేటకు చెందిన మట్టా సునీత(24) ఆదివారం సాయంత్రం ఇంటి పక్కనున్న రేకుల షెడ్డులో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సూసైడ్ నోట్, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన ఓ వివాహితుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మోసం చేయడంతో మనస్తాపానికి గురై తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆమె తండ్రి నకులుడు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పోలీసులు అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసునమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజేష్ తెలిపారు.
యువకుడిని బలిగొన్న లారీ
పెరవలి: లారీ రూపంలో రహదారిపై చీకట్లో పొంచి ఉన్న మృత్యువును ఆ యువకుడు గమనించలేకపోయాడు. ఫలితంగా రాంగ్ రూట్లో, హెడ్లైట్లు కూడా వేయకుండా దూసుకొచ్చిన లారీ అతడి ప్రాణాన్ని కబళించింది. ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు, పెరవలి మండలం తీపర్రు గ్రామానికి చెందిన కుంపట్ల పెద వీరన్న(24) ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ, కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. ఆదివారం కాకరపర్రులో పనికి వెళ్లి, రాత్రి 10.30 సమయంలో మోటార్ బైక్పై స్వగ్రామానికి తిరిగి పయనమయ్యాడు. మార్గం మధ్యలో రహదారిపై ఓ లారీ హెడ్ లైట్లు వేయకుండా రాంగ్ రూట్లో ఆగి ఉంది. లైట్లు వేయకుండానే ఆకస్మికంగా ఆ లారీని ముందుకు దూసుకురావడంతో.. అటుగా మోటార్ బైక్పై వచ్చిన పెద వీరన్న అదుపుతప్పి లారీని వెనుక నుంచి ఢీకొన్నాడు. ఈ ఘటనలో అతడి తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు అతడి తండ్రి కుంపట్ల వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబాన్ని మంత్రి కందుల దుర్గేష్ పరామర్శించారు.

ఏయూ డిగ్రీ ఫలితాల్లో ‘ఆదిత్య’ ప్రతిభ