
ఇసుక రీచ్లో.. ఓవర్లోడ్ దందా
●
గద్వాల క్రైం: రాజోళి మండలంలోని తుమ్మిళ్ల ఇసుక రీచ్ను అడ్డాగా చేసుకొని కొందరు ఓవర్లోడ్ దందాకు తెరలేపారు. ఒక టిప్పుర్లో 20 టన్నుల ఇసుక తరలించాల్సి ఉండగా.. 27 టన్నుల చొప్పున తరలిస్తూ ఒక్కో అదనపు టన్నుకు రూ.వెయ్యి చొప్పున వసూలు చేస్తూ జేబులు నింపుకొంటున్నారు. ఈ దందాకు కొందరు అధికారులు సైతం తోడయ్యారు. ఇలా రోజుకు 30 – 40 టిప్పర్ల ఇసుకను అనుమతుల పేరుతో తరలిస్తూ రూ.లక్షలు వెనకేసుకుంటున్నారు. గడిచిన మూడు రోజుల వ్యవధిలో విజిలెన్స్ అధికారులు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి 20 టిప్పర్లు ఓవర్లోడ్తో వెళ్తుండడాన్ని గుర్తించడంతో విషయం బయటికి వచ్చింది. కేసులు నమోదు చేసి రూ.1.45 లక్షలు జారిమానా వసూలు చేశారు.
నిబంధనలు తుంగలో తొక్కి దందా..
నడిగడ్డలోని గద్వాల–అలంపూర్ సెగ్మెంట్లలోని ఇసుక కొరత కారణంగా గృహ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఈక్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం టీజీఎండీసీ ద్వారా తుమ్మిళ్ల ఇసుక రీచ్ నుంచి ఇసుకను ఆన్లైన్లో బుకింగ్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే, జిల్లాలోని ఓ మాజీ ఎమ్యెల్యే అంతా తానై ఇసుక దందాకు తెరలేపారనే ఆరోపణలు వినవస్తున్నాయి. సదరు మాజీ ఎమ్మెల్యే.. ఓ మాజీ ప్రజాప్రతినిధికి ఈ ఇసుక రీచ్ టెండర్ను దక్కించేలా ముఖ్యపాత్ర పోషించాడనే ఆరోపణలు ఉన్నాయి. అనంతరం తన అనుచరవర్గంలోని కొందరిని రీచ్ వద్ద ఉంచి ప్రతి టిప్పర్ (ట్రిప్పు)లో 7 టన్నుల ఇసుకను ఎక్కువగా తరలించే ప్రక్రియను చేపట్టారు. ఒక్కో అదనపు టన్ను ఇసుకకు రూ.వెయ్యి చొప్పున వసూలు చేస్తున్నారు. వాస్తవంగా టిప్పర్కు 20 టన్నులు ఇసుక తరలింపునకు అనుమతి ఉంటుంది. అయితే అదనంగా 7 టన్నుల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. రోజుకు సగటున రూ.2.10 లక్షల అక్రమ ఆదాయం వైట్ కాలర్ నాయకులకు చేరుతుంది.
తుమ్మిళ్ల ఇసుక రీచ్ అడ్డాగా అక్రమాలు
మా దృష్టికి రాలేదు..
తుమ్మిళ్ల ఇసుక రీచ్ నుంచి ప్రభుత్వం టీజీ ఎండీసీ ద్వారా ఇసుక తరలింపునకు అనుమతి ఇచ్చింది. ప్రాజెక్ట్ అధికారి పర్యవేక్షణలో ఇసుక తరలింపు కొనసాగుతుంది. టిప్పర్కు 20 టన్నుల ఇసుక తరలించేందుకు అనుమతి ఉంది. సామర్థ్యానికి మించి ఇసుకను తీసుకెళ్తున్నట్లు మా దృష్టికి రాలేదు. ఒకవేళ తరలిస్తే శాఖ పరమైన చర్యలు ఉంటాయి. తుమ్మిళ్ల రీచ్ విషయంపై సంబంధిత అధికారితో మాట్లాడి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం.
– వెంకటరమణ, జిల్లా మైనింగ్ అధికారి
కేసులు నమోదు చేస్తాం
ఇటీవల జిల్లాలోని పలు చోట్ల తనిఖీలు చేయగా.. సామర్థ్యానికి మించి టిప్పర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో మైనింగ్, రవాణాశాఖకు వాహనాలు అప్పగించి జారిమానాలు విధించాం. ప్రభుత్వ అనుమతులు లేకున్నా, వాహనాల్లో ఓవర్లోడ్గా ఇసుకను తరలించినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ఇప్పటికే రాష్ట్ర విజిలెన్స్ బృందం సైతం తనిఖీలు చేపట్టింది. ఎవరినీ ఉపేక్షించేది లేదు. – మొగిలయ్య డీఎస్పీ, గద్వాల
ఒక్కో టిప్పర్లో ఏడు టన్నులు అధికంగా లోడ్ చేస్తున్న వైనం
ట్రిప్పుకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు వెనకేసుకుంటున్న ఇసుకాసురులు
విజిలెన్స్, పోలీసుల తనిఖీలో బహిర్గతం
మూడు రోజుల వ్యవధిలో 20 టిప్పర్ల పట్టివేత.. కేసులు నమోదు
అంతా తామై.. వెనకుండి నడిపిస్తున్న కొందరు జిల్లా నాయకులు
ఇసుక టిప్పర్ల పట్టివేత
గద్వాల క్రైం: సామర్థ్యానికి మించి ఇసుక తరలిస్తున్న టిప్పర్లను గద్వాల పట్టణ, రూరల్ ఎస్ఐలు కళ్యాణ్కుమార్, శ్రీకాంత్ ఆదివారం పట్టుకున్నారు. వివరాలిలా.. రాజోలి మండలం తుమ్మిళ్ల ఇసుక రీచ్ నుంచి గద్వాల మీదుగా ఇసుకను టిప్పర్లలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇసుక అనుమతి వివరాలపై ఆరా తీశారు. మొత్తం ఏడు టిప్పర్లను తనిఖీ చేయగా.. అందులో సామర్థ్యానికి మించి ఐదు టిప్పర్లలో ఇసుక తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సదరు టిప్పర్లను మైనింగ్ లేదా రవాణాశాఖ అధికారులకు అప్పగించనున్నట్లు ఎస్ఐ తెలిపారు.

ఇసుక రీచ్లో.. ఓవర్లోడ్ దందా

ఇసుక రీచ్లో.. ఓవర్లోడ్ దందా

ఇసుక రీచ్లో.. ఓవర్లోడ్ దందా