
మంత్రివర్గంలో చోటు హర్షణీయం
కొత్తకోట రూరల్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుచేసిన తర్వాతే గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని వడ్డెవాటలో సంఘం జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు భీమన్ననాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని బీఆర్ఎస్, కాంగ్రెస్పార్టీలు బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, జనాభా దామాషా ప్రకారం రాజకీయ ప్రాతినిథ్యం ఇవ్వకుండా ముందుకు సాగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చోటు కల్పించడాన్ని స్వాగతిస్తున్నామని.. అనేక పోరాటాల ఫలితంగానే కరుడుగట్టిన కాంగ్రెస్పార్టీ సామాజిక న్యాయం వైపు అడుగులేస్తోందని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మొదటిసారి ఇద్దరు, రెండోసారి ఒక బీసీకి మంత్రివర్గంలో అవకాశమిచ్చారన్నారు. బీసీల పోరాటం ఎక్కడా వృథా కాలేదని.. ఇటీవల ఐదు ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్పార్టీ చరిత్రలో లేనివిధంగా అగ్రకుల సామాజిక వర్గానికి లేకుండా మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించారని తెలిపారు. ఎవరి వాటా వారికి దక్కాలని రాహుల్గాంధీ చెప్పారని.. అందుకు అనుగుణంగా అటు ఇటుగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఎమ్మెల్సీగా, మంత్రులుగా అవకాశం దక్కడం హర్షిస్తున్నామన్నారు. ఇదే పద్ధతిన నామినేటెడ్ పోస్టులు, యూనివర్సిటీ వైస్ చాన్స్లర్, సమాచార కమిషన్లో బీసీల వాటా బీసీలకు కేటాయించాలని కోరారు. 42 శాతం రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో పాస్ చేసి ఢిల్లీకి పంపించి రెండు నెలలవుతుందని.. రాష్ట్రపతి వెంటనే ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా జాతి జనగణనలో బీసీ కులగణన చేపడతామని చెప్పారని.. బీజేపీని నమ్మాలంటే బీసీ బిల్లును వెంటనే అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామన్నగౌడ్, జిల్లా అధ్యక్షుడు బాలరాజుగౌడ్, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు దోమ వెంకట్ ముదిరాజ్, బీసీ నేతలు జనార్దన్గౌడ్, బస్వరాజ్, రంగస్వామి, వెంకటన్నగౌడ్, శ్రీనివాస్గౌడ్, తిరుపతయ్య, రాందాస్, ఉద్యోగ సంఘం నేతలు వెంకటేష్, మహేష్ మేరు, దోమ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.