
పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
భూపాలపల్లి రూరల్ : పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శుక్రవారం భూపాలపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. కమలాపూర్, నందిగామ, నాగారం, ఆజాంనగర్, పంబాపూర్, దూదేకులపల్లి, గొల్లబుద్దారం, రాంపూర్, ఆముదాలపల్లి, కొంపల్లి, గుడాడ్పల్లి, గోర్లవీడు, వజినపల్లి, నేరేడుపల్లి, కొత్తపల్లి (ఎస్ఎం) మోరంచపల్లి, శ్యాంనగర్ గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ మంజూరు పత్రాలు పంపిణీ చేసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదోడి సొంతింటి కలను నిజం చేయడమే సీఎం రేవంత్రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని తెలిపారు. మొదటి విడతలో పేరురాని వారు బాధపడాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు రాంచంద్రయ్య, నాయకులు తోట సంతోష్, ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు.
బడిబాట ప్రారంభించిన ఎమ్మెల్యే..
మండలంలోని కమలాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఉపాధ్యాయులతో కలిసి బడిబాట పోస్టర్లను ఆవిష్కరించారు.పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని, గ్రామస్తులు సహకరించాలని సూచించారు. మండల విద్యాశాఖ అధికారి దేవానాయక్, ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.