
లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు షురూ
జఫర్గఢ్: మండల కేంద్రమైన జఫర్గఢ్ పడమర కొండపై వెలిసిన శ్రీలక్ష్మీనర్సింహస్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతీఏటా నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నుంచి మూడురోజుల పాటు పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు పొడిచేటి వెంకటాచార్యులు తెలిపారు. మొదటి రోజులో భాగంగా 81 కళాశాలతో స్వామివారికి కళాభిషేకం చేశారు. అనంతరం భక్తులు మొక్కులు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.
శ్మశానవాటిక అభివృద్ధిపై రివ్యూ చేస్తాం
జనగామ: జనగామ పట్టణంలోని నెహ్రూపార్కు ఏరియా 60 ఫీట్ల రోడ్డులోని వైకుంఠ ధామం అభివృద్ధిపై త్వరలోనే సంబంధిత అధికారులతో రివ్యూ చేస్తామని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. ‘చివరి మజిలీలో గౌరవం ఎక్కడ..!’ శీర్షికన ఈ నెల 8వ తేదీన సాక్షిలో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. వైకుంఠ ధామంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొనేలా చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
గోపినాథ్ మరణం బాధాకరం
● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి
జనగామ: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆకస్మిక మరణం పార్టీకి తీరనిలోటని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. హైదరాబాద్ రాజకీయాల్లో ఓ విలక్షణమైన స్థానాన్ని ఏర్పరచుకున్న మాగంటి, నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ చెరగని ముద్ర వేశారన్నారు. మాగంటి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఎమ్మెల్యే పల్లా ఆకాంక్షించారు.
నేడు మధ్యాహ్న భోజనం తయారీపై శిక్షణ
జనగామ:జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారీపై జిల్లా స్థాయిలో నేడు (సోమవారం) ఒక్కరోజు శిక్షణ ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కేంద్రం రైల్వే స్టేషన్ ఏరియా ప్రభుత్వ పాఠశాలలో నేడు కాంప్లెక్స్ హెచ్ఎంతో పాటు వంట తయారీ గ్రూపులోని ఒకరు జిల్లా స్థాయి శిక్షణకు హాజరు కావాల్సి ఉంటుంది. అలాగే 10వ తేదీన మండల స్థాయిలో జరిగే శిక్షణ కార్యక్రమానికి కాంప్లెక్స్ హెచ్ఎం, ప్రతీ పాఠశాల నుంచి ఒక వంట తయారీ ప్రతినిధి హాజరు కావాల్సి ఉంటుంది. సర్కారు బడులకు వచ్చే విద్యార్థులకు ప్రభుత్వం అందించే భోజనంలో మరింత నాణ్యతను పెంచే విధంగా ఈ శిక్షణ దోహద పడనుంది. శిక్షణలో వంట తయారీకి సంబంధించిన మేళకువలతో పాటు ప్రత్యక్షంగా వివిధ వంటకాలను తయారు చేసి సంబంధిత ఫొటోలను రాష్ట్ర స్థాయి విద్యాశాఖ అధికారులకు పంపించమన్నారు.
11 నుంచి బీపీఈడీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి బీపీఈడీ విద్యార్థులకు నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 11 నుంచి నిర్వహిస్తున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపా రు. ఈనెల 11, 13, 16, 18 తేదీల్లో ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు.

లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు షురూ