
పరిశోధనా పద్ధతులపై అవగాహన ఉండాలి
కేయూ క్యాంపస్: వివిధ సామాజిక అంశాలపై పరిశోధనలు చేసేటప్పుడు పద్ధతులపై అవగాహన అవసరమని కాకతీయ యూనివర్సిటీ సోషియాలజీ అండ్ ఎంఎస్డబ్ల్యూ విభాగం అధిపతి ప్రొఫెసర్ స్వర్ణలత అన్నారు. శుక్రవారం యూని వర్సిటీలోని రాజనీతిశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సోషల్సైన్స్ పరిశోధకులకు రీసెర్చ్ మెథడాలజీపై ఏర్పాటుచేసిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. పరిశోధకులకు పరిశీలనలో నమూనా పద్ధతులను ఆమె వివరించారు. కేస్ స్టడీ అనేది కీలకంగా ఉంటుందని చెప్పారు. సమావేశంలో ఆ విభాగం అధిపతి డాక్టర్ సంకినేని వెంకటయ్య, అధ్యాపకులు డాక్టర్ నాగరాజు, పరిశోధకులు పాల్గొన్నారు.
డీఈఈసెట్ అభ్యర్థులకు
9నుంచి సర్టిఫికెట్ల పరిశీలన
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో డీఈఈసెట్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల ప్రవేశాలకుగాను ఈనెల 9నుంచి 13వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని హనుమకొండ ప్రభుత్వ డైట్ కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ ఎండీ అబ్దుల్హై శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమతమ ఒరిజనల్ సర్టిఫికెట్లతోపాటు ర్యాంకు కార్డు, హాల్టికెట్, ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్, 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు తీసుకురావాలని పేర్కొన్నారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ఈనెల 14నుంచి 17వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సింటుందని తెలిపారు. పూర్తి వివరాలకు టీజీడీఈఈసెట్ వెబ్సైట్లో చూడాలని సూచించారు.