
సమస్యల పరిష్కారానికి కృషి
● ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్
ధర్మపురి: ధర్మపురిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. పట్టణంలోని 5, 13వ వార్డుల్లో వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి మంగళవారం పర్యటించారు. తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ సమస్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీలోని 15 వార్డుల్లో సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. తాగునీటి సరఫరాలో ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. చింతామణి చెరువు కట్టను మినీ ట్యాంక్బండ్లా మార్చుతామని, గోదావరి నుంచి చెరువులోకి ప్రత్యేక పైపులైను ద్వారా నీటిని తరలిస్తామని వివరించారు. ప్రజలు వాకింగ్ చేయడానికి వీలుగా విద్యుత్ లైట్లు, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామన్నారు. మురుగు నీరు గోదావరిలో కలువకుండా సీనరేజ్ ప్లాంట్ కోసం రూ.17 కోట్లు అవసరమని సీఎం దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్, నాయకులు ఎస్.దినేష్, వేముల రాజు, చీపరిశెట్టి రాజేశ్, సీపతి సత్యనారాయణ, ధర్మకర్తలు తదితరులున్నారు.