
విద్యార్థుల జీవితాలతో కూటమి చెలగాటం
వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సిహెచ్ వినోద్
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యార్థుల భవిష్యత్తో చెలగాటమాడుతోందని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సిహెచ్.వినోద్కుమార్ విమర్శించారు. పదవ తరగతి మూల్యాంకాన్ని లోపభూయిష్టంగా నిర్వహించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నగరంపాలెంలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో డీఈఓ సీవీ రేణుకకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా పదో తరగతి పరీక్షల నిర్వహణలో అటు పాలకులు, అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఎటువంటి ఫీజు లేకుండా కోరిన ప్రతి విద్యార్థి జవాబు పత్రాలను రీవాల్యూయేషన్ చేయించాలని డిమాండ్ చేశారు. తుది ఫలితాలు వచ్చే వరకు అడ్మిషన్లను కొన్ని రోజుల పాటు నిలిపివేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల విషయంలో జరిగిన తప్పులకు బాధ్యులైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నేతలు పాల్గొన్నారు.